తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న ఒక అద్భుతమైన పాలరాతి నిర్మాణం. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పరిగణించబడుతోంది. UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్మహల్ వైభవాన్ని పురస్కరించుకుని, తాజ్ మహోత్సవ్ నిర్వహిస్తారు.
తాజ్ మహోత్సవ్ అనేది ఆగ్రాలో జరుపుకొనే వార్షిక సాంస్కృతిక ఉత్సవం. ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించబడుతోన్న ఈ ఉత్సవాన్ని తాజ్ మహల్ గౌరవార్థం నిర్వహిస్తారు. తాజ్ మహోత్సవ్ 2024, ఫిబ్రవరి 18నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి. ప్రతి ఫిబ్రవరిలో తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్ ప్రాంతంలో ఉత్సవం జరుగుతుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం..

ప్రేమ కథకు నివాళి మాత్రమే కాదు..
తాజ్ మహోత్సవం 2024, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శిల్పగ్రామ్లోని తాజ్ మహల్ పరిసరాల్లో ఫిబ్రవరి 18 నుండి 27 వరకు నిర్వహించబడుతోంది. చారిత్రిక ప్రాముఖ్యతకి ప్రసిద్ధి చెందిన ఆగ్రా, మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరియు ముంతాజ్ల శాశ్వతమైన ప్రేమను గౌరవించటానికి అంకితం చేయబడిన ఈ వేడుకలకు నగరం వేదిక కావడం ఆనవాయితీగా వస్తోంది.
తాజ్ మహోత్సవ్ వారి ప్రేమకథకు నివాళులర్పించడం మాత్రమే కాకుండా భారతదేశ గొప్ప కళ, సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేందుకు వేదికగా కూడా చెప్పబడుతోంది. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతతోపాటు చారిత్రక మూలాలను పరిశోధించేందుకు వేలాదిగా ఔత్సాహికులు ఇక్కడికి చేరుకుంటారు.
సాంస్కృతిక వారసత్వ వేడుక
ఈ ఉత్సవం మొదటిసారిగా 1992లో నిర్వహించబడింది. అప్పటి నుండి ఇది ఒక ప్రసిద్ధ సాంస్కృతిక కార్యక్రమంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. సాంప్రదాయ కళలు, చేతిపనులు మరియు ఆహారం ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పండుగ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వ వేడుకగా పేరుగాంచింది. పండుగ సందర్భంగా, సందర్శకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రదర్శించే పోటీలను వీక్షించవచ్చు.

కళాకృతుల సమ్మేళనం
భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వందలాది కళాకారులు తమ కళాకృతులను ప్రదర్శిస్తారు. వీటిలో భదోహి నుండి చేతితో తయారు చేసిన తివాచీలు, ఖుర్జా నుండి కుండలు, లక్నో నుండి చికాన్, బనారస్ నుండి పట్టు మరియు జరీ, కాశ్మీర్/గుజరాత్ నుండి శాలువాలు మరియు తివాచీలు, ఫరూఖాబాద్ నుండి చేతి ముద్రణ, పశ్చిమ బెంగాల్ నుండి కాంతా కుట్టు ఇలా చెప్పుకుంటే ఉంటే దేశంలోని ప్రత్యేక ఆకర్షణలన్నీ ఒకే చోట చూసే అనుభూతి కలుగుతుంది. వీటితోపాటు తమిళనాడు నుండి చెక్క/రాతి శిల్పాలు, ఈశాన్య భారతదేశం నుండి వెదురు/చెరకు కళాకృతులు సందర్శకుల చూపుతిప్పుకోనీయవు.
ధైవత్ రికార్డ్స్ & ప్రొడక్షన్స్ వంటి అనేక బాలీవుడ్ మీడియా సంస్థలు, చలనచిత్ర నిర్మాణ సంస్థలు ఈ మహోత్సవ్లో పాల్గొంటాయి. ఆటపాటలతో సందడి చేస్తారు.
తాజ్ మహోత్సవంలో మరొక ప్రసిద్ధ ఆకర్షణ ఫుడ్ ఫెస్టివల్. ఇది సాంప్రదాయ భారతీయ వంటకాల యొక్క విభిన్న రుచులను అందిస్తుంది. సందర్శకులు స్ట్రీట్ ఫుడ్, స్వీట్లు, ప్రధాన వంటకాలతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలను మనసారా ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications













