హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరాముడు. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రామాలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలోని అయోధ్య రామాలయానికి ప్రత్యేక గుర్తింపు వుంది. అయితే, ఈ రామాలయంతో పాటు దేశంలో ప్రసిద్ధిచెందిన రామాలయాలు చాలానే ఉన్నాయి.
అయోధ్యలోని రామాలయం..
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో వెలసిన రామమందిరం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయం సరయూ నది ఒడ్డున వెలసింది. ఈ ఆలయంలో జనవరి 22న రాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా చెబుతారు. దేవుడు నిర్మించిన నగరంగా అయోధ్యకు ప్రాధాన్యత కలిగి ఉంది.

శ్రీ రామ తీర్థ మందిర్, అమృత్సర్
పంజాబ్లోని అమృత్సర్లో శ్రీరామ తీర్థ మందిర్ వెలసింది. లంక నుంచి అయోధ్యకు వచ్చిన తర్వాత సీతమ్మతల్లి నిందారోపణలు ఎదుర్కొంది. మళ్లీ అడవుల పాలయ్యింది. ఆ సమయంలో సీతమ్మతల్లి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం స్థలంలో నిర్మించిన ఆలయమే శ్రీరామ తీర్థ మందిర్. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఉంది. ఈ ఆశ్రమంలోనే సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చింది. అంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమిది.
సీతా రామచంద్రస్వామి ఆలయం, భద్రాద్రి
సీతారాములు నడయాడిన ప్రదేశంగా భద్రాద్రిగా కొలుస్తారు. ఈ ప్రదేశం ఒక అటవీప్రాంతం. ఇక్కడే సీతారాములు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. భద్రాద్రిలోని అన్ని ప్రాంతాలు ఎంతో పవిత్రమైనవని, అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

రఘునాథ్ ఆలయం, జమ్మూ
ఉత్తరభారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయం రఘునాథ్ ఆలయం. ఈ ఆలయం జమ్మూలో వెలసింది. ఇక్కడ వివిధ దేవాలయాలు వెలిశాయి. రఘునాథ్ ఆలయం మొఘల్ నిర్మాణ శైలిలో ఉంటుంది.
కాలారామ్ ఆలయం, మహారాష్ట్ర
కాలారామ్ ఆలయం ఒక పురాతన హిందు దేవాలయం. ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్లో వెలసింది. ఈ ఆలయంలో నల్లరంగు రాముడి విగ్రహం ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని కాలారామ్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. ఆలయం ప్రధాన ద్వారం వద్ద హనుమంతుని విగ్రహం ఉంటుంది. అది కూడా నలుపురంగులో ఉండడం విశేషం.

రామరాజ దేవాలయం, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని రామరాజు ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీన్ని ఒక కోట ఆకారంలో నిర్మించారు. ఇక్కడి ఆలయంలో కాపలాగా పోలీసులను పెట్టారు. శ్రీరాముడికి ప్రతిరోజూ సాయుధ వందనం అందజేయడం ఇక్కడి ఆనవాయితీ. ఇక్కడ రాముడిని దేవుడిగా కాకుండా రాజుగా పూజిస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత.

కనక్ భవన్ ఆలయం, అయోధ్య
అయోధ్యలో వెలసిన కనక్ భవన్ దేశంలోని ప్రముఖ రామాలయాల్లో ఒకటి. ఈ భవన్ అధ్భుతమైన శిల్పకళా వైభవానికి నిదర్శమని చెప్పుకోవాలి. దశరథుడు తన మూడో భార్య కైకేయికి బహుమతిగా ఇచ్చిన రాజభవనమే ఈ కనక్ భవన్ అని చెబుతుంటారు. కైకైయి ఈ భవనాన్ని సీతాదేవికి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ భవన్లో సీతారాముల విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి.
త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం, కేరళ
కేరళలో ప్రసిద్ధిచెందిన రామాలయం త్రిప్రయార్ శ్రీరాముని ఆలయం. ఇది కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన శ్రీరాముని విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడని స్థానికులు చెబుతుంటారు. కేరళ వెళ్లినవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరాముని దర్శించుకుంటే భక్తులు దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం.



Click it and Unblock the Notifications













