ఆంధ్రప్రదేశ్లో ప్రతి పన్నేండేళ్లకు ఒకసారి నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027లో రాజమండ్రిలో గోదావరి మహా పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా ప్రారంభమయ్యాయి. గోదావరి పుష్కరాలకు ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పుష్కరాల కంటే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కృష్ణ, తుంగభద్ర, కావేరి పుష్కరాలతో పాటు మరెన్నో పుష్కరాలు ఉన్నా, గోదావరి పుష్కరాలు ఎంతో పేరుగాంచాయి. ఈ పుష్కరాలు భక్తుల మనసుల్లో విశేష స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు..
కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. గోదావరి పుష్కరాలు-2027 జులై 23వ తేది నుంచి ఆగస్టు 3వ తేది వరకు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అధకారులు ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇక, ఈ సారి నిర్వహించే గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఈ పుష్కరాల నిర్వహణ కోసం అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఓసారి చూసేద్దాం..

సుమారు 8 కోట్ల మంది భక్తులు..
ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. 2027 జూలై 23వ తేది నుంచి ఆగస్టు 3వ తేది వరకు గోదావరి పుష్కరాల నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2015 సంవ్సతరంలో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ రాజమండ్రిలో చోటు చేసుకున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో విషాదాన్ని మిగిల్చాయి. అయితే, ఈ సారి జరగబోయే పుష్కరాల కోసం సుమారు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్ల మేర ఖర్చయే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనలను అధికార యంత్రాంగం సిద్దం చేసింది. అయితే, గోదావరి పుష్కరాలకు సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే వాటి ఏర్పాట్లలో పడ్డారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు ప్రారంభించారు.

ఎక్కడైనా స్నానాలు చేయొచ్చు..
ఈ సారి జరగబోయే గోదావరి పుష్కరాలు-2027కు ఇప్పటికే ముసాయిదా యాక్షన్ ప్రణాళికను కూడా అధికారులు సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసేలా కాకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి లో ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటికి మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని వారు భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై అధికారులు చర్చలు జరిపారు.
రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ను అధికారులు ప్రతిపాదించారు. ఇందులో భాగంగానే కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్ల బడ్జెట్, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదనలు చేశారు. వీటితోపాటు సిటీ బ్యూటిఫికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈసారి జరగబోయే గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయిం తీసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.



Click it and Unblock the Notifications













