రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ప్రకృతి ప్రసాదించిన ప్రదేశంగా పేరుపొందుతోంది ఎత్తిపోతల జలపాతం. ఇది నాగార్జునసాగర్ నుంచి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో తారసపడుతుంది. పచ్చదనంతో నిండిన ఇక్కడి పర్యావరణం.. ప్రశాంతతకు మారు పేరు అని చెప్పొచ్చు. ఇటీవల కురుస్తోన్న వర్షాలకు ఈ జలపాతం కొత్త రూపాన్ని సంతరించుకుంది. గలగలా ప్రవహించే ఇక్కడి నీటి ప్రవాహం.. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న నక్కవాగు, చంద్రవంక వాగు, తుమ్మల వాగుల సమ్మేళనమే ఎత్తిపోతల జలపాతంగా ప్రాచుర్యం పొందింది. నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఈ జలపాతం కనువిందు చేస్తుంది. చుట్టూ ఉన్న ఎత్తైన కొండ మీదుగా 70 అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతపు అందాలను మాటల్లో వర్ణించడం కష్టమేనండోయ్. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతల జలపాతం వరద నీటితో జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
ఇక్కడి జలపాతపు సవ్వడులను పరిశీలిస్తే.. నయాగరా అందాలను తలపించేలా ఉంటాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తోన్న వర్షాల వల్ల ఎత్తిపోతలలో మరింత నీటి ప్రవాహాం పెరిగింది. కొండలపైనుంచి కొట్టుకొస్తోన్న ఆ ఎర్రని మట్టినీరు 70 అడుగుల ఎత్తునుంచి కిందకు దూకుతూ ఉంటే.. ఆ సందర దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తోన్న పర్యాటకులు క్యూ కడుతున్నారంటే నమ్మండి!

మొసళ్ల పెంపకం కేంద్రం..
ముఖ్యంగా నిండు కుండలా దర్శనమిస్తోన్న సాగర్ ప్రాజెక్ట్, నాగార్జునుడి కొండ, మ్యూజియంను చూసేందుకు వస్తోన్న పర్యాటకులకు ఈ ఎత్తిపొతల జలపాతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ జలపాతం సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రవహించి కృష్ణా నదిలోనికి కలుస్తుంది. అలాగే, పక్కనే ఉన్న కొండపై నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఒక అందమైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేయడంతో సెల్ఫీలు, ఫోటోలతో సందర్శకులు అక్కడ సందడి చేస్తున్నారు. జలపాతం వల్ల ఏర్పడిన చెరువు వద్ద ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో మొసళ్ల పెంపకం కేంద్రం నిర్వహిస్తున్నారు. అంచేత పర్యాటకులు ఇక్కడి దిగువ భాగంలో దిగకుండా హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొసళ్లు అరుదుగా తారసపడుతుంటాయి.

పురాతన ఆలయాల నిలయంగా..
ఇక్కడి ప్రాంతం పురాతన ఆలయాలకు నిలయంగా చెప్పబడుతోంది. ఇందులో ప్రధానమైనది దత్తాత్రేయ దేవాలయం. ఇది ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుంచి పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున కనిపిస్తుంది. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు ఆ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని ప్రచారంలో ఉంది. అర్థరాత్రి సమయంలో ఆ దత్త శిలపైపు తల పెట్టి దత్తాత్రేయుడిని ధ్యాన్యం చేస్తే దత్తదర్శనం తప్పకుండా కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అలాగే, రంగనాయక స్వామి ఆలయం కూడా ఇక్కడి ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా ఉంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ ఆలయం ఇక్ష్వాకుల కాలంలో నిర్మించారని, దీనిని విష్ణుకుండినులు మరింత అభివృద్ధి చేశారని శాసనాల ద్వారా గుర్తించారు. ఈ ఆలయం స్వయంభూవుగా వెలిసిందని ప్రచారంలో ఉంది. ప్రతీ ఏటా వర్షా కాలంలో మధువంక పొంగి రంగనాయక స్వామి పాదాల వరుకు నీరు చేరుతుంది. ఇక్కడికి దగ్గరలోనే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం కూడా ఉంది.



Click it and Unblock the Notifications













