దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపం.. ఖమ్మంలో..
భారతేదశంలో పురాతన కట్టడాలు చాలానే ఉన్నాయి. అవి వాటి ప్రాచీన ఆనవాళ్లకు ప్రసిద్ధి చెందాయి. తెలంగాణలో కూడా ఎన్నో పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపం మన తెలంగాణలోనే ఉంది. అది కూడా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఉంది. నేలకొండపల్లి బౌద్ధస్థూపాలకు ప్రసిద్ధిగాంచింది. రెండో శతాబ్దంలో కట్టిన కట్టడాలు నేటికి ఇక్కడ అలానే ఉన్నాయి. అప్పట్లో దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బుద్ధ విగ్రహాల సరఫరా జరిగేదని తెలుస్తోంది. బౌద్ధ విగ్రహాల తయారీ కేంద్రం కూడా ఇక్కడే ఉండేదని ఇక్కడివారు చెబుతున్నారు. నేలకొండపల్లి అంటే 'నెలసెండా' అనే పట్టణం. ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన ఉంటుంది. ఈ ఇండికా గ్రంథాన్ని 2వ శతాబ్దంలోనే చరిత్రకారుడు టోలమీ రచించాడు.

కీచకగుండం అనే పేరు... ఇలా వచ్చింది..
నేలకొండపల్లి ఒక చారిత్రాత్మక ప్రదేశం. మహాభారతంతో ముడిపడ్డ కథలు ఇక్కడ మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ ప్రాంతం ఖమ్మం నుండి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక మట్టి కోట గోడ ఉంటుంది. ఈ నేలకొండపల్లిలో మూడు శివాలయాలు, అలాగే రెండు వైష్ణవ ఆలయాలు సహా పురాతన ఆలయ సముదాయం కూడా నెలకొని ఉంది. నేలకొండపల్లిలో జరిగే దసరా వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిస్తారు. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి. కీచకుడిని చంపిన తర్వాత పాతిపెట్టిన ప్రాంతం కూడా ఇదే కావడంతో, దీనికి కీచకగుండం అని పేరువచ్చింది.

భక్త రామదాసు ధ్యాన మందిరం..
నేలకొండపల్లి పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చే మరో పేరు భక్తరామదాసు. భద్రాచలంలో శ్రీరాముడికి గుడి కట్టించిన పరమ భక్తుడు రామదాసు. రామదాసు క్రీ.శ.1664లో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. భక్త రామదాసును కంచర్ల గోపన్న అని కూడా పిలుస్తారు. ఇది ఆయన జన్మస్థలం. భక్త రామదాసు స్మారక భవనం ఇక్కడ 1955వ సంవత్సరంలో నిర్మించబడింది. ప్రస్తుతం దీనిని భక్త రామదాసు ధ్యాన మందిరం అని కూడి పిలుస్తున్నారు. దీని నిర్వహణ భాద్యతలన్నీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారు చూస్తున్నారు. నేలకొండపల్లి చరిత్ర రెండువేల సంవత్సరాల నాటిది. పాండవులు 12 ఏళ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తరభారతం నుంచి దక్షిణభారత ప్రాంతానికి వచ్చారని, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద విరాటరాజు రాజ్యం ఉండేదని పురాణాలు చెబుతున్నాయి.
చేరుకోవడం ఎలా...
నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ, కూసుమంచి వరకు కలిపే ఒక ప్రధాన జంక్షన్ సమీపంలో ఉంది. పర్యాటకులు నేలకొండపల్లి నుండి బస్సులు, ఆటోల ద్వారా సమీపంలోని బోదులబండ, అనంతనగర్, ఆరెగూడెం, కట్టుకచవరం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఖమ్మం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేలకొండపల్లి. హైదరాబాద్ నుంచి సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంది ఖమ్మం. ఈ బౌద్ధస్థూపం చుట్టూ పార్కును ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నారు. ఇప్పటికీ బౌద్ధ బిక్షువులు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. 2వ శతాబ్ధం నాటి ఈ కట్టడాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఖమ్మం వైపుగా వచ్చే వారు ఈ పురాతన కట్టడాలను తప్పకుండా సందర్శించాల్సిందే.



Click it and Unblock the Notifications












