విదేశాలను తలపించే అందమైన ప్రదేశాలు భారత్లోనూ ఉన్నాయ్..!
భారతదేశం భిన్నత్వంతో నిండిన దేశం. ఇక్కడి అపారమైన అందం, ప్రశాంతమైన వాతావరణంతో ప్రయాణ ప్రియులకు స్వర్గాన్ని తలపిస్తున్నాయి. హిల్ స్టేషన్ల నుండి బీచ్లు, ఎడారుల వరకు, వెకేషన్లో అద్భుతంగా గడిపేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశంలో చూడదగిన ప్రదేశాలకు కొరతే లేదు. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, అటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటి అందం విదేశీ ప్రదేశాలను కూడా తలదన్నేలా చేస్తుంది. విదేశీ ప్రదేశాలను తలదన్నే అందమైన ప్రదేశాలు భారత్లోనూ ఉన్నాయి. విదేశాలను సందర్శించాలని ప్రణాళిక వేస్తుంటే మాత్రం ముందుగా భారత్లోని ఈ ప్రదేశాలను సందర్శించండి. రండి అవెంటో చూద్దాం.

గుల్మార్గ్
ప్రయాణాలంటే ఇష్టపడే వారు తప్పకుండా స్విట్జర్లాండ్ను సందర్శించాలని కలలు కంటారు. కానీ, భారతదేశంలో స్విట్జర్లాండ్లా కనిపించే ఒక ప్రదేశం ఉందని, అది గుల్మార్గ్ అని మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటే నిజంగా ఏదైనా విదేశీ ప్రదేశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి స్విట్జర్లాండ్ వెళ్లాలనుకునేవారు ముందుగా భారత్లోని గుల్మార్గ్ను సందర్శించండి.
లడఖ్
లడఖ్లో ప్రకృతిలోని అనేక రంగులను ఒకేసాని చూసే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి దృశ్యాన్ని కేవలం పుస్తకాల్లోనే చూసేవాళ్లని ఈ అందాన్నిచూసిన తర్వాత అనుకుంటారు. ఎత్తైన బూడిద, గోధుమ, పసుపు పర్వతాలు, పైన నీలి ఆకాశం, పర్వతాల గుండా ప్రవహించే నదులు, కొన్ని ప్రదేశాలలో మంచుతో కప్పబడిన పర్వతాలు ఈ ప్రదేశపు అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఈ ప్రదేశపు అందం ఆస్ట్రేలియాతో పోల్చబడింది.

రాణిఖేత్, ఉత్తరాఖండ్
రాణిఖేత్ అనే అందమైన హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో సముద్ర మట్టానికి 1,829 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించేవారికి అన్ని సీజన్లలో ఈ పర్యాటక ప్రదేశం ఉత్తమ గమ్యస్థానం అనే చెప్పుకోవాలి. రాణిఖేత్లో అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన హోటళ్లు, రిసార్టులు కలిగి ఉన్నాయి. ఇక్కడ రోడ్సైడ్ ఫుడ్లతో పాటు చైనీస్, ఉత్తరభారత, టిబెటన్ నుండి కుమావోన్ వరకు రుచికరమైన వంటకాలను అందించే హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఊటీ, తమిళనాడు
తమిళనాడులోని అద్భుతమైన ప్రదేశం, చాలా ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానం ఊటీ. ఈ ప్రదేశం వేసవి నుండి శీతాకాలం వరకు సందర్శించడానికి ఉత్తమమైనది. ఊటీ అన్ని వైపుల నుండి పచ్చదనంతో చుట్టబడి ఉంటుంది. ఇక్కడి ఇళ్ల నిర్మాణం, పూల తోటలు, గడ్డితో కప్పబడిన చర్చిలు వంటి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. నీలగిరి పర్వతాలపై ప్రసిద్ధిగాంచిన ఓ పర్యాటక కేంద్రం ఉదకమండలం. ఇది 'క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్'గా ప్రసిద్ది చెందింది , ఊటీ దక్షిణాన అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్గా గుర్తించబడిన ఉదకమండలం ఎత్తైనది. పశ్చిమ కనుమలలో 2240 మీటర్ల ఎత్తులో ఉంది. ఊటీ నీలగిరి కొండలలో ఉంది. అంటే "నీలి పర్వతాలు" అని అర్థం. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వికసించే కురుంజి పువ్వు కారణంగా ఈ పేరు వచ్చింది.
మషోబ్రా, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్లోని మరొక అందమైన ప్రదేశం మషోబ్రా. ఇరువైపులా సింధు, గంగానది సరిహద్దులుగా, సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉంది. సతత హరిత పైన్, దేవదార్ అడవులతో చుట్టుముట్టబడిన ఇది వృక్ష, జంతుజాల వైవిధ్యం మషోబ్రాకు అదనపు అందాన్ని చేకూరుస్తుంది. వీటితోపాటు మషోబ్రా అడవులలో ఓక్, దేవదారు, మాపుల్, గుర్రపు చెస్ట్నట్ పుష్కలంగా ఉన్నాయి. వన్యప్రాణులలో కోతులు, బబూన్లు, నక్కలు, మొరిగే జింకలు, చిరుతపులి, హిమాలయన్ డేగ, నెమళ్లు, చికోర్ మరియు పార్ట్రిడ్జ్లు వంటి పక్షి జాతులు ఉంటాయి. మషోబ్రాలో అనేక పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి.



Click it and Unblock the Notifications












