దేశంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. దీపావళి పండుగను సంబరాలు మొదలుకానున్నాయి. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కొన్ని ప్రదేశాలలో జరిగే దీపావళి వేడుకలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వెళ్తుంటారు. మరి ఆ ప్రదేశాలను మీరు చూడాలనుకుంటున్నారా..? అయితే, మరెందుకాలస్యం ఆ ప్రాంతాలేంటో ఓ లుకేద్దాం రండి..
భారతదేశంలో అనేక పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగలను ఎంతో సంప్రదాయంగా నిర్వహిస్తారు. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఎలాంటి కుల, మత భేదాలు లేకుండా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళ ప్రతి ప్రాంతం విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. ప్రతి ఇళ్లు దీపాలతో అందంగా అలంకరిస్తారు. దీపావళిని చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇక, పురాణాల ప్రకారం చూసుకుంటే మాత్రం శ్రీరాముడు రావణాసురిడిని వధించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు దీపావళి పండుగ చేసుకుంటారు. భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ ఎంతో ప్రత్యేకం.. అవేంటో చూసేద్దాం..

కోల్కత్తా
దీపావళి వేడుకలు కోల్కత్తాలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఇక్కడ కాళీ పూజతో సమానంగా చూస్తారు. పెద్ద పెద్ద పాండల్స్ ఏర్పాటు చేసి దీపాలతో అలంకరించడం ఇక్కడి ఆనవాయితీ. ఇక, కోల్కత్తాలో ప్రసిద్ధిగాంచిన హౌరా బ్రిడ్జి గురించి అందరికీ తెలిసిందే. ఈ వంతెనను విద్యుత్ దీపాలు, పూలతో ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించాలనుకునేవారు దీపావళి వేళ తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.
వారణాసి
దీపావళి సమయంలో వారణాసిని తప్పకుండా వీక్షించాల్సిందే. గంగా నదీ తీరాన ఇక్కడ అనేక వేల దీపాలు వెలిగిస్తారు. ఈ అద్భుత దృశ్యాన్నీ వీక్షించేందుకు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి.. దీపావళి వేల ఇక్కడ కొన్ని లక్షల దీపాలు వెలిగించి అరుదైన రికార్డ్ను కూడా సృష్టించారు. ఇక, ఇక్కడ సాయంత్రం వేళ జరిగే గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తారు.

ఉదయ్ పూర్
దీపావళి వేళ దేశంలో సందర్శించాల్సిన ప్రదేశాలలో మరొకటి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్. ఈ ప్రాంతం సరస్సులు, రాజభవనాలకు పేరుగాంచింది. దీపావళి సందర్భంగా ఇక్కడ లైట్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆటలు, పాటలు, జానపద సంగీతం వంటివి ఉంటాయి. ఈ నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ దీపాలతో ముస్తాబు చేస్తారు. దీపావళి వేళ ఆకాశంలోకి స్కై ల్యాంప్ వదులుతారు.
అయోధ్య
దీపావళి పండుగ సందర్భంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను తప్పక వీక్షించాల్సిందే. ఇక్కడ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశ చరిత్ర, సంస్కృతిని ప్రతిబించే విధంగా ఇక్కడి వేడుకలు ఉంటాయి. ఇక, ఈ సంవత్సరం జరగబోయే దీపావళి వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయి. కారణం..సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహం ప్రతిష్టించారు. కాబట్టి ఇక్కడ దీపావళి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

జైపూర్
దీపావళి వేళ దేశంలో సందర్శించాల్సిన ప్రదేశాలలో జైపూర్ ఒకటి. ఈ ప్రాంతం పింక్ సిటీగా కూడా పేరొందింది. ఇక్కడ దీపావళి సమయంలో ఏర్పాటు చేసే మార్కెట్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ మార్కెట్స్లో అనేక రకాల సంప్రదాయ వస్తువులు ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. సంప్రదాయకమైన లాంతర్లు, ఆహార పదార్థాలు కూడా ఈ మార్కెట్స్లో లభిస్తాయి. దీపావళి సందర్బంగా జైపూర్లోని రాజభవనాలు, కోటలు, ఉద్యానవనాలు విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపిస్తాయి..



Click it and Unblock the Notifications















