ఈశాన్య భారత దేశంలో అందమైన రాష్ట్రాల్లో త్రిపుర కూడా ఒకటి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే క్రీస్తుశకం 1949 లో త్రిపుర భారత దేశంలో విలీనమయ్యింది. అంతవరకూ ఇది స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఈ త్రిపురలో ఇప్పటికీ గిరిజన సంప్రదాయాన్ని మనం చూడొచ్చు. అంతేకాకుండా అంత ఎత్తుగా లేని పర్వతాలు, నిర్మలమైన నీటితో కూడిన సరస్సులు, అభయారణ్యాలు కూడా ఈ త్రిపుర సొంతం. ఈ నేపథ్యంలో త్రిపురలో చూడదగిన ముఖ్యమైన పర్యాటక కేంద్రాలు మీ కోసం...

ఉజ్జయనాథ ప్యాలెస్
P.C: You Tube
ఉజ్జయనాథ ప్యాలెస్ తెల్లని అందమైన భవంతి. దీనిని క్రీస్తుశకం 1899 1901 మధ్యలో త్రిపుర రాజు రాధా కిషోర్ మాణిక్యం నిర్మించారు. ఈ ప్యాలెస్ మొత్తం 800 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో హాల్స్ చాలా విశాలంగా ఉంటాయి. దీనిని 1972 నుంచి 2011 వరకూ దీనిని అసెంబ్లీగా కూడా వినియోగించారు. ప్రస్తుతం ఇది మ్యూజియంగా ఉంది. ఈశాన్య భారత దేశంలో ఇది అతి పెద్ద మ్యూజియం.

రుద్రసాగర్లో ప్రయాణం
P.C: You Tube
రుద్రసాగర్ అందమైన సరస్సు. ఈ సరస్సులో పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని ఆనందాలను మిగులుస్తుంది. ఈ నది ఒడ్డునే నీర్ మహల్ కూడా ఉంటుంది. ఈ మహల్లో రాజ కుటుంబ సభ్యలు నివశిస్తూ ఉండేవారు. ఈ భవనంలో మొత్తం 24 గదులు ఉన్నాయి. ఈ భవనం ముందుభాగంలో ఉన్న ఉద్యానవనం మీకు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

హెరిటేజ్ పార్క్
P.C: You Tube
ఈ వారసత్వ పార్క్ త్రిపురలోనే కాకుండా ఈశాన్య భారత దేశంలో కూడా మొదటిది. దీనిని తప్పకుండా సందర్శించాలి. త్రిపుర కళ, సంస్క`తి, వారసత్వం తదితర విషయాలకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకుండా త్రిపురకు మాత్రమే ప్రత్యేకమైన ఎన్నో రకాల మొక్కలు, పక్షులు, జంతువును కూడా మనం ఇక్కడ చూడొచ్చు.

అభయారణ్యం
P.C: You Tube
త్రిపుర రాజధాని అగర్తల నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో అగర్తల-ఉదయ్పూర్ హైవే దగ్గరగా ఉన్న సిపాయిజోలా అభయారణ్యం కూడా చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. ఈ అభయారణ్యంలో సుమారు 150 జాతులకు చెందిన పక్షులు ఉన్నట్లు చెబుతారు. అంతేకాకుండా కేవలం శీతాకాంలోనే సందర్శించడానికి వీలయ్యే ఎన్నో రకాల పక్షులతో పాటు జంతువులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు.

జంపూహి హిల్స్
P.C: You Tube
అగర్తల నగరానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంపూహి హిల్స్ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి. ఇక్కడి వాతావరణం చాలా మనోహరంగా ఉంటుంది. అందువల్లే ఇక్కడకు ట్రెక్కింగ్ కోసం యువత ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఇక్కడ పర్యటకుల రద్ది ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications













