దేశంలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఈసీజన్లో పర్యటించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు, పురాతన భవనాలు, జలపాతాలు, ప్రకృతి అందాలతో నిండిపోయిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ, అద్భుతమైన కట్టడాలను చూడాలనుకుంటే మాత్రం పింక్సిటిగా పేరొందిన జైపూర్ను సందర్శించాల్సిందే. ఇక్కడ ఎన్నో పురాతనమైన కోటలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైనది హవామహల్...దీని ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం పదండి..!
పింక్ కిటికీలకు ప్రసిద్ధి...
హవా మహల్ పింక్ కిటికీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్యాలెస్ అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. దూరం నుంచి చూస్తే ఈ ప్యాలెస్ శ్రీకృష్ణుని కిరీటంలా కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ నిర్మాణం, వాస్తుశిల్పం, డిజైన్ ఒక్కసారి చూస్తే, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. హవా మహల్ ఐదు అంతస్తులు, 87 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ మహల్ను ఎరుపు, గులాబీ వర్ణపు ఇసుకరాళ్ళతో నిర్మించారు. అందుకే ఈ మహల్ ను పింక్ సిటీకి చిహ్నంగా చెబుతారు. ఈ కోటలో సుమారు వేయి కిటికీలు ఉండడంతో మేడలోకి గాలి సులభంగా ప్రవేశిస్తుంది. అందుకే దీన్ని హవా మహల్ అని పిలుస్తారు. వేసవిలోనూ ఇక్కడ చల్లగా ఉంటుంది. దీన్ని 1799లో జైపూర్ మహారాజు ప్రతాప్ సింగ్ నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంట పడకుండా నగరంలో జరుగుతన్న సంఘటనలు, రాజప్రాసాదపు ప్రదర్శనలను చూసేందుకు వీలుగా ఈ మహల్ను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

సుమారు వెయ్యి కిటికీలు..
హవా మహల్లో మొత్తం 953 కిటికీలు ఉన్నాయి. ఈ కిటికీలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవాలి. ఈ ప్యాలెస్ యొక్క తోరణాలు ఇస్లామిక్ శైలిలో నిర్మించబడ్డాయి. వేణువులతో కూడిన స్తంభాలు రాజపుత్ర శైలిలో తయారు చేయబడ్డాయి. హవా మహల్ లోపల మూడు దేవాలయాలు ఉన్నాయి. అందులో గోవర్ధన్ కృష్ణ దేవాలయం, ప్రకాష్ మందిరం మరియు హవా మందిర్ ఉన్నాయి. హవామహల్ కు రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి ఆనంద్ పోల్ కాగా, రెండోది చంద్ పోల్. ఆనంద్ పోల్ పై గణేశుడి విగ్రహం ఉండడంతో ఆ ద్వారాన్ని గణేశ్ పోల్ అని కూడా పిలుస్తారు. జైపూర్ లోని పాతనగరంలో మెయిన్ రోడ్డుపైనే ఈ మేడ ఉంటుంది. ఇది మొత్తం ఐదు అంతస్తులు ఉంటుంది. ఈ మహల్15 మీటర్ల ఎత్తు ఉంటుంది.

హవా మహల్ చరిత్ర
హవా మహల్ నిర్మాణాన్ని మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ 1799లో నిర్మించారు. ఈ ప్యాలెస్ ప్రధాన వాస్తుశిల్పి లాల్ చంద్ ఉస్తాద్. ఈ ప్యాలెస్ కృష్ణుని కిరీటం వలె నిర్మించబడి ఉంటుంది. సవాయి ప్రతాప్ సింగ్ కృష్ణ భక్తుడు, సవాయి ప్రతాప్ సింగ్ మహారాజా సవాయి జై సింగ్ మనవడు కాబట్టి, హవా మహల్ ఆకారం తేనెగూడులా నిర్మించబడిందని చెబుతుంటారు.
ఎలా చేరుకోవాలి?
హవా మహల్కు వెళ్లాలనుకునేవారికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీకి 268 కిలోమీటర్ల దూరంలో జైపూర్ ఉంది. రైల్లో ప్రయాణిస్తే ఐదారు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. అదే విమాన మార్గం ద్వారా అయితే ఢిల్లీ నుండి జైపూర్కు 2 గంటల్లో చేరుకోవచ్చు, ఆపై అక్కడి నుండి లోకల్ టాక్సీ క్యాబ్ ద్వారా హవా మహల్ చేరుకోవచ్చు. అయితే, వ్యక్తిగత కారు లేదా బైక్ ద్వారా వెళ్లాలనుకుంటే మాత్రం కేవలం 6 నుండి 7 గంటల్లో సులభంగా హవా మహల్ చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













