వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్లో ప్రకృతిసిద్దమైన కొన్ని పర్యాటక ప్రదేశాలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. అలాంటి ప్రాంతాల్లో పచ్చని ప్రకృతి దృశ్యాలతో కనువిందుచేసే అరకకు ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ అందాలను మనసారా ఆస్వాదించాలనుకునే భాగ్యనగర వాసులకు తెలంగాణ టూరిజం మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. కుటుంబ సమేతంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఈ టూర్ ప్యాక్ ఎంతో అనువుగా ఉంటుంది.
అందరికీ అందుబాటులో ఉండేలా వారి వారి బడ్జెట్కు తగ్గట్టు తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి అరకుకు అతి తక్కువ ధరలో వస్తోన్న ఈ ప్యాకేజీలో మొత్తం 2 రాత్రులు, 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ప్రతీ గురువారం టూర్ షెడ్యూల్ను అందుబాటులో ఉంచారు. మరెందుకు ఆలస్యం హైదరాబాద్ నుంచి అరకు వెళ్లేందుకు రూపొందించిన ఈ టూర్ జర్నీ ఎలా సాగనుందో ఓ లుక్కేద్దామా!
టూర్ ప్లాన్ ఇలా ఉంటుంది..
తొలి రోజు సాయంత్రం టూర్ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు IRO పర్యాటక భవన్ నుంచి, CRO బషీర్బాగ్ నుంచి 6.00 గంటలకు బస్సు బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉండడంతోపాటు మార్గమధ్యంలో భోజన ఏర్పాట్లు ఉంటాయి. మరునాడు ఉదయం 6 గంటలకు అన్నవరం చేరుకుంటారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్లో ఫ్రెషప్ అనంతరం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ చేసిన అన్నవరంలో టెంపుల్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మళ్లీ ప్రయాణం మొదలవుతుంది. మధ్యలో సింహాచలం దర్శనం ఉంటుంది. అలా సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

ఇక మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రోడ్డు మార్గంలోనే అరకు టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహలు, ధింసా డ్యాన్స్ చూపిస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్కి చేరుకుని.. ఆ రాత్రికి విడిది చేయాలి. నాలుగో రోజు ఉదయం వైజాగ్కు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఆ రోజు విశాఖ నగరంలోని సందర్శనీయ ప్రదేశాలైన ఆర్కే బీచ్, ఫిషింగ్ ఆర్బర్, సబ్ మెరైన్, సబ్ మెరైన్ మ్యూజియం, కైలాసగిరి వంటివి చూపిస్తారు. అలా సాయంత్రానికి మళ్లీ విశాఖ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్కు వెళ్లేందుకు పెద్దలకు ఒక్కొక్కిరికి రూ. 7,500గా, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 6000గా నిర్ణయించారు. ఇక ఈ ప్యాకేజీలో ఏసీ 21సీటర్ వాహనంలో ప్రయాణం ఉంటుంది.

ఇక పర్యాటకులకు నాన్ ఏసీ హోటల్లో వసతి, వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కవర్ అవుతాయి. ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు టూర్ ప్యాకేజీకి అధనంగా చెల్లించాల్స ఉంటుంది. టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు https://tourism.telangana.gov.in/ లింక్పై క్లిక్ చేస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications













