కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్యలో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య మొత్తం అత్యంత అద్భుతంగా ముస్తాబయ్యింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు వీవీఐపీలు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాంలాలా విగ్రహం చాలా రోజులుగా ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం సాధారణ ప్రజలు కూడా రాంలల్లా దర్శనం కోసం అయోధ్య ఆలయానికి వెళ్లవచ్చు. అయితే, అయోధ్య వెళ్లాలనుకునేవారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.
అయోధ్య రాంలల్లాను ఎప్పుడు చూడగలరు?
జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం మరియు సంప్రోక్షణ అనంతరం జనవరి 23 నుంచి భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవబడతాయి. దీని తరువాత, భక్తులు ఆలయంలోకి ప్రవేశించి, రాంలాలా దర్శనం, అయోధ్య శ్రీరాముని హారతిలో పాల్గొనవచ్చు. అయోధ్య రాములోరిని వీక్షించేందుకు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామజన్మభూమి వద్ద ఉన్న ఈ ఆలయానికి రామభక్తులకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముని బాల రూపాన్ని ప్రతిష్టించడం జరిగింది.

అయోధ్య రామాలయం అధికారిక వెబ్సైట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం, అయోధ్య వెళ్లాలనుకునే భక్తులు ఉదయం 7 నుండి 11:30 గంటల వరకు దర్శనం కోసం ఆలయానికి రావచ్చు. దీని తరువాత, మధ్యాహ్నం 2 నుండి 7 గంటల మధ్య సాయంత్రం దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. రాంలల్లా దర్శనంతో పాటు, అయోధ్య శ్రీరాముని ఉదయం మరియు సాయంత్రం హారతిలో కూడా పాల్గొనవచ్చు. అయితే, ఇందు కోసం ప్రత్యేక పాస్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
హారతి కోసం అందుబాటులో ఉన్న పాస్లు ఉచితం. అయితే దీని కోసం ముందుగా బుక్ చేసి పాస్ పొందాల్సి ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ అనే రెండు మార్గాల్లో పాస్లను బుక్ చేసుకోవచ్చు. రామమందిరం వెబ్సైట్లో ఆన్లైన్ పాస్ బుకింగ్ చేయబడుతుంది. ఇక, ఆఫ్లైన్ బుకింగ్ చేయాలనుకునేవారు మాత్రం శ్రీరామ జన్మభూమి క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే పాస్ పొందగలరు. ఉదయం హారతి కోసం ఒక రాత్రి ముందు, సాయంత్రం హారతికి అరగంట ముందు వెళ్లాల్సి ఉంటుంది. పాస్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. కాబట్టి, అయోధ్య రాములోరి దర్శనం చేసుకోవాలనుకుంటే, పాస్ బుక్ చేసుకోవాల్సిందే. వీటితో పాటు ప్రభుత్వ IDని కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
వేడుకకు హాజరయిన పలువురు ప్రముఖులు...
ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు వీవీఐపీలు కూడా హాజరయ్యారు. 51 అంగుళాల ఎత్తైన రాంలాలా విగ్రహాన్ని ప్రధాని ప్రారంభించడం జరిగింది. విష్ణువు యొక్క పది అవతారాలు మరియు సనాతన ధర్మానికి సంబంధించిన ముఖ్యమైన చిహ్నాలు కూడా ఈ విగ్రహంపై చిత్రీకరించబడ్డాయి. అందమైన బట్టలు, ఆభరణాలలో రాంలల్లా విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మహోజ్వల ఘట్టం కోసం అయోధ్య ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. ఆలయ ప్రాంగణం చుట్టూ పుష్పాలు, శ్రీరాముని కటౌట్లలతో నిండి ఉన్నాయి. మరెందుకాలస్యం మీరు కూడా అయోధ్య శ్రీరాముని దర్శన భాగ్యం పొందండి.



Click it and Unblock the Notifications













