ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. కర్నూలు అతిపెద్ద జిల్లా. ఇది హైదరాబాదు నుండి షుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కడప, చిత్తూర్, అనంతపూర్ చేరడానికి కర్నూల్ గుండా ప్రయాణించవలసి ఉండటం వల్ల దీనిని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. ఈ ప్రాంతం చిన్న ఊళ్ళ అందం, అతిధి సత్కారాల సంస్కృతితో పర్యాటకులలో ఒక మంచి అనుభూతిని కల్గిస్తుంది. చారిత్రిక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో ఈ ప్రాంతం ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది.
చారిత్రిక వివరం
ప్రాచీన సాహిత్యం, శాసనాల్లో చెప్పబడినట్టు కందనవోలు అనే తెలుగు పదం నుంచి కర్నూల్ అనే పేరు వచ్చింది. కర్నూల్ కి వేల సంవత్సరాల చరిత్ర వుంది. కర్నూల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న కేతవరంలో దొరికిన రాతి చిత్రం ప్రాచీన రాతి యుగం నాటిది. జుర్రేరు లోయ, కటవాని కుంట, యాగంటి లలో లబించిన రాతి శిల్పాలు 35000 నుంచి 40000 ఏళ్ళ నాటివి. మధ్య యుగాలలో భారత దేశాన్ని సందర్శించిన జువాన్ జాంగ్ అనే చైనా దేశపు పర్యాటకుడు తన కధనాల్లో కరాచీ వెళ్ళే దారిలో కర్నూల్ ను దాటానని రాసుకున్నాడు. ఏడవ శతాబ్దంలో కర్నూల్ బిజాపూర్ సుల్తాన్ల పాలనలో వుండేది. అంతకు ముందు దీన్ని శ్రీ కృష్ణదేవరాయల వారు పాలించారు. 1687 లో ఈ ప్రాంతాన్ని ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేజిక్కించుకుని దీన్ని నవాబుల అధీనంలో వదిలేశాడు. తరువాత నవాబులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని కర్నూల్ ను 200 ఏళ్ళ పాటు స్వతంత్రంగా పాలించారు. 18వ శతాబ్దంలో నవాబులు బ్రిటిష్ వారి తో పోరాడారు.
పురాతన కట్టడాలు, ఆలయాల నగరం
పురాతన కట్టడాలు, చారిత్రిక నిర్మాణాలు పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులకు, కర్నూలు అటువంటి ప్రదేశాలను విస్తృతంగా అందిస్తుంది. మధ్య యుగంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన కోటల శిధిలాలలో పురాతన కాలపు అరబ్బీ, పర్షియా శాసనాలు ఉన్నాయి.
ఈ కోటను తప్పక సందర్శించాలి. కొండారెడ్డి బురుజు, అబ్దుల వహాబ్ సమాధి చూడదగిన అద్భుత ప్రదేశాలు. కర్నూల్ పాలకుల వేసవి విడిది, వరద రక్షిత గోడ, కొన్నిప్రాముఖ్యత కల్గిన పేట ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, షిర్డీ సాయి బాబా ఆలయం కూడా చూడ దగిన ప్రదేశాలు. కర్నూలు నవంబరు, డిసెంబర్ నెలలలో ప్రసిద్ధ రధొత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ పండుగ ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. దీనిని ఆంజనేయస్వామి పేరున జరుపుకుంటారు.
నగరానికి ప్రయాణం
కర్నూలు నగర ప్రయాణం సులువుగా, సౌకర్యవంత౦గా ఉంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కర్నూల్ కి సమీప విమానాశ్రయం. కర్నూలు నగరం నుండి ఈ విమానాశ్రయానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లోని నగరాల నుండి అలాగే బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. తీవ్రమైన వేడితో కూడిన కర్నూలు లోని వేసవి ఆహ్లాదకరంగా ఉండదు. కర్నూలులో వర్షాలు కూడా బాగా పడతాయి; అందువల్ల అక్టోబర్ నుండి మార్చ్ నెలలలో వర్షాల తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమమైనది. ఈ సమయంలో, మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది, పర్యాటక కార్యకలాపాలకు అనువుగా వుంటుంది.