అతిరాప్పిల్లి త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది. ఇది కొచ్చి కి 70 కి.మీ లు, త్రిస్సూర్ కి 60 కి.మీ లు దూరంలో గల ఒక ప్రథమ శ్రేణి గ్రామ పంచాయితీ. అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. సమృద్ధి గా కనిపించే జీవ వైవిద్యం ఇక్కడి విశిష్టత. పర్యావరణ మంత్రి జై రాం రమేష్ దీన్ని "సైలెంట్ వ్యాలీ" గా అభివర్ణించారు. అతిరాప్పిల్లి లో వళచల్, చార్పా జలపాతాలు కుడా ఉన్నాయి. ఇక్కడి జీవావరణవ్యవస్థ కేరళ రాష్ట్రానికే ప్రత్యేకమైనది గా పరిగణించబడుతుంది.
జంతుజాలం తో విరాజిల్లుతూ ...ఈ ప్రాంతం అత్యంత హరిత ప్రదేశం గా, ఉజ్వలమైన వన్యప్రాణుల తావుగా పేరు గాంచిన పశ్చిమ కనుమల సమీపంలో ఉన్నది.
ఈ కనుమలు అతిరాప్పిల్లి వళచల్ ప్రాంతంగా సుపరిచితమైన అడవులకు ప్రసిద్ధిగాంచాయి. ఈ అడవులు అంతరించే, అరుదైన జాతులకు చెందిన అనేక జంతువులూ, పక్షులకు ఆలవాలమయ్యాయి. " వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా" ఈ హరిత ప్రదేశాన్ని "భారతదేశం లో అత్యుత్తమ ఏనుగుల సంరక్షణ యత్నానికి చిహ్నం" గా పేర్కొంది. "ఇంటర్నేషనల్ బర్డ్ అసోషియేషన్" అతిరాప్పిల్లిని ఒక ముఖ్యమైన "బర్డ్ ఏరియా" గా గుర్తించింది. నాలుగు రకాల అంతరించిపోతున్న హార్న్ బిల్ మొదలుకొని అనేక పక్షి జాతులు ఇక్కడ నివసించటమే దీనికి ప్రధాన కారణం.
ఇక్కడ వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలం కనిపిస్తుంది. అందుచేత, "ఆసియన్ నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్" ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనం గానో లేక అభయారణ్యము గానో ప్రకటించవలసిందిగా సిఫార్సు చేసింది.అయిదు ప్రధాన భాగాలుగా అడవి విభజించబడింది: అతిరాప్పిల్లి , వళచల్, చార్పా, కొల్లతిరిమేడు మరియు షోలయార్. అన్ని జలపాతాలకి రహదారులు, కాలిదారులు వేయటం జరిగింది. అయితే, వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. వర్షాకాలం లో ప్రధాన నది అయిన చలకుడి, ఇంకా అనేక చిన్న కాలువలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. పరిసర ప్రాంతం అంతా జీవ కళ తొణికిసలాడుతూ తన ఉనికి కనుక్కుని పులకరించమంటూ పలకరిస్తూ సందడి చేస్తుంది.
అందమైన జలపాతాలకి చిరునామా ...
ఇక్కడి అరణ్యాలు కోదార్ అనబడే ఆదిమ గిరిజనులు కి ఆవాసాలు. వీరు సహజ సిద్ధమైన తేనె, మైనం, సగ్గుబియ్యం మరియు ఏలకులు,అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు సేకరించటం లో నిపుణులు. వారి జీవనశైలి ని మీరు పరిశీలించవచ్చు.అందువల్ల, ఈ గ్రామం కేరళ లోనే ప్రసిద్ధ పర్యాట ప్రదేశం గా పేరుగాంచింది. విపరీతమైన వైవిద్యం తో అసాధారణ ప్రాంతంగా పేరుకెక్కింది. ఆశ్చర్యజనకమైన జలపాతాలు మిమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్ళే ఇక్కడి ఇతర ఆకర్షణలు.
అతిరాప్పిల్లి జలపాతం, వళచల్ జలపాతం, చార్పా జలపాతం ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా చేసాయి. ఈ జలపాతాలని చూడడానికి అత్యుత్తమ సమయం క్రమబద్దీకరించబడింది. ప్రజా సందర్శనార్ధం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా తెరిచి ఉంచబడుతుంది. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్, షాపింగ్, రివర్ రాఫ్టింగ్, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలలో పాలుపంచుకోవచ్చు. దగ్గరలో డ్రీం వరల్డ్ , సిల్వర్ స్టార్మ్ అని రెండు అమ్యూజ్ మెంట్ పార్కులు ఉన్నాయి. అతిరాప్పిల్లి లోని ఈ రెండు పార్కులు ఒక విలక్షణమైన ఉత్సాహభారితమైన వినోదాన్ని అందిస్తాయి. అతిరాప్పిల్లి లోని సమృద్ధిగా ఉన్న సహజ సంపదని ఆవిష్కరించండి - ప్రకృతి తో సామరస్యం, అలౌకిక శక్తి యొక్క సామీప్యత, పశ్చిమ కనుమల తో పారవశ్యం, విశిష్టమైన జీవవైవిధ్యం. మీ బ్యాగు సర్దుకుని వర్షాకాలం లో గానీ చలికాలం గానీ సందర్శించండి. అతిరాప్పిల్లి కి రహదారి ఉంది. సమీపం లో గల రైల్వే స్టేషన్ కి గానీ విమానాశ్రయానికి గానీ ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications