దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇక, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పండుగ వేళ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 75వ గణతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం ఆమె రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన, పదేళ్ల నియంతృత్వ పాలనకు ప్రజలు స్వస్తీచెప్పారు అన్నారు.
గత ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించింది. జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. ఇక, ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఇక, ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ రాష్ట్రం శకటాన్ని ప్రదర్శించారు. మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. 'మదర్ ఆఫ్ డెమోక్రసీ' థీమ్తో శకటాన్ని రూపొందించారు.

ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడ పడుచులకు జరిగిన అవమానాల గాథల నుంచి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమాన్ని శకటం రూపంలో ప్రజల ముందుకు తెచ్చారు. ఇక, ఇందులో తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గోండు వీరుడు కొమురం భీం, బ్రిటీష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రాంజీ గోండు, వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాలను శకటాలపై ప్రదర్శించారు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా తెలంగాణ సర్కార్ శకటాలను రూపొందించడం జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే రెండు సార్లు మాత్రమే శకటాన్ని ప్రదర్శించారు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే ఢిల్లీలో రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది. మొదటిసారి 2015 సంవత్సరంలో 'బోనాలు' థీమ్తో రాష్ట్ర శకటం కర్తవ్యపథ్ పై ప్రదర్శన ఇచ్చింది. ఇక, రెండోసారి సరిగ్గా ఐదేళ్లకు అంటే 2020లో మరోసారి తెలంగాణ శకటాలను ప్రదర్శించడం జరిగింది. అప్పడు బతుకమ్మ, వేయి స్తంభాల గుడి, మేడారం సమక్క-సారక్క జాతర రూపకంతో శకటం ప్రదర్శించడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం డిజైన్లు కూడా పంపలేదని తెలుస్తోంది. గతేడాది శకటాల ప్రదర్శనకు కూడా హాజరు కాలేమని గత ప్రభుత్వం కేంద్రానికి లెటర్ కూడా పంపిందంట.
2016, 2017, 2018, 2019 సంవత్సరాలలో శకటాల డిజైన్లు పంపినా, అవి మొదటి దశలోనే రిజెక్టు అయినట్లు అధికారులు చెబుతున్నారు. 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలను ప్రదర్శించేందుకు ఎంపిక చేయడం జరిగింది. వీటితోపాటు కేంద్ర శాఖలు, రక్షణ విభాగానికి చెందిన మరిన్ని శకటాలు ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్, హర్యానా, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఏడాది వేడుకల్లో 'నారీ శక్తి'ని ప్రోత్సహించేందుకు కవాతులో తొలిసారిగా మొత్తం మహిళలు పాల్గొనడం జరిగింది.



Click it and Unblock the Notifications













