రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్తను అందించింది. విజయవాడ నుంచి పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్టిసి పలు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే త్రిలింగ దర్శిని, అరుణాచలం, శ్రీశైలం, పంచారామాలు, శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే వీటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి పూర్తి వివరాలను చూసేద్దాం..
అతి తక్కువ ధరకే..
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా విజయవాడ నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టిసీ నిర్ణయించింది. త్రిలింగ దర్శిని ప్యాకేజీలో భాగంగా ఏపీలోని యాగంటి, మహానంది, శ్రీశైలం శైవ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం సూపర్ లగ్జరీ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రతి కార్తిక శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుంటుంది. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది.
పౌర్ణమి సందర్భంగా..
వీటితోపాటు అరుణాచలం, గిరి ప్రదక్షిణకు కూడా ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకరానున్నారు. ఇందులో భాగంగానే సూపర్ లగ్జరీ సర్వీసులు నడపనున్నారు. అరుణాచలం, గిరి ప్రదక్షిణకు పౌర్ణమి రెండు రోజుల ముందుగా విజయవాడ నుంచి ఈ ప్యాకేజీ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్లో శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. పౌర్ణమికి అరుణాచలం చేరి గిరి ప్రదక్షిణ అనంతరం విజయవాడ చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.2,500గా నిర్ణయించారు.

విజయవాడ నుండి పంచారామాల దర్శనాలు..
ఇందులో భాగంగానే విజయవాడ నుంచి పంచారామాలకు కూడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు కార్తీక మాసంలో ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. నవంబర్ 2, 3, 4, 9, 10, 11, 15, 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 4 గంటలకు విజయవాడ నుండి పంచారామాలకు స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి.
ఇందులో భాగంగానే అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించుంటారు. ఇక, అదే రోజు రాత్రి విజయవాడ చేరుకుంటారు. వీటి టిక్కెట్ ధరలు ఓసారి పరిశీలిస్తే.. సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ. 1,120 చెల్లించాల్సి ఉంటుంది. శ్రీశైలం యాత్రకు కూడా ఏపీఎస్ఆర్టిసి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీశైలానికి ప్రతి ఆదివారం, ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనికి సాధారణ ఛార్జీలే వర్తిస్తాయన్నారు. భక్తులు శబరిమలై యాత్రకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.



Click it and Unblock the Notifications













