ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్తను అందించింది. భక్తుల కోసం విజయనగరం నుంచి పంచారామాలకు స్పెషల్ సర్వీసులను, ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా భక్తులకు ఐదు ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించింది. ఈ సర్వీసులకు సంబందించిన పూర్తి వివరాలను చూసేద్దాం..
విజయనగరం నుంచి ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక కేంద్రాలైన పంచారామాల దర్శనం కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులకు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీసులు వచ్చే (నవంబర్) నెల 3, 10, 17, 24 తేదీల్లో విజయనగరం నుంచి బయల్దేరుతాయి. మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం రాబోతుంది. ఈ సమయంలో చాలామంది వివిధ పుణ్యక్షేత్రాలను వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటివారికోసమే ఏపీఎస్ఆర్టిసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే పంచారామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ పేర్కొన్నారు.
ప్రతి ఆదివారం బస్సులు అందుబాటులో..
ఆర్టీసీ అందిస్తోన్న ఈ ప్యాకేజీలో భాగంగా పంచారామాలైన అమరావతి లోని అమరేశ్వరుని దర్శనంతోపాటు, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరుడు, భీమవరంలోని సోమేశ్వరుడు, ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు, సామర్లకోట లోని కొమర లింగేశ్వరుడు వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఇందుకోసం ఏపీఎస్ఆర్టిసి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు ప్రత్యేకంగా నడుపుతోంది. ఇక, ఈ బస్సులు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు విజయనగరం బస్ కాంప్లెక్స్ నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. పంచారామాల క్షేత్రాల సందర్శన తర్వాత తిరిగి మంగళవారం తెల్లవారుజామున విజయనరానికి చేరుకుంటాయి.

ఛార్జీలివే..
ఈ ప్యాకేజీలో భాగంగావిజయనగరం నుంచి ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీకి రూ.2 వేలు ఛార్జ్ చేయగా, అల్ట్రా డీలక్స్కు రూ.1,950 టికెట్ చార్జీగా అధికారులు నిర్ణయించారు. ఈ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునేవారు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్.ఇన్ వెబ్సైట్లో, బుక్ చేసుకోవచ్చు. లేదంటే డిపోకౌంటర్లలో బుక్ చేసుకునే సదుపాయం కలదు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం వారు ప్రయాణించే చోటుకు బస్సు పంపుతామని విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి పేర్కొన్నారు..
ఏడు రోజుల యాత్ర..
వీటితో పాటు మరిన్ని సేవలను కూడా ఆర్టీసీ అందిస్తోంది. అందులో భాగంగానే విజయనగరం నుంచి ఏడు రోజులు యాత్రగా విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, ఫళని, గురువాయూర్, ఎరుమేలి, సన్నిదానం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలం దర్శనాలను కూడా చేసుకోవచ్చు.
11 రోజుల యాత్ర...
దీంతోపాటు 11 రోజుల యాత్రగా విజయవాడ, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవాని, ఫళని, గురువాయూరు, ఎరుమేలి, సన్నిదానం, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలం వరకు కూడా ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలను కూడా చూసేయొచ్చు. విజయనగరం నుంచి విశాఖ దర్శిని, అరకు దర్శిని, పుణ్యగిరి, లంబసింగి, అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, టెక్కలి రావివలస వంటి క్షేత్రాలకు కూడా రెంట్ ప్రాతిపదికన బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. టిక్కెట్లు బుకింగ్ లేదా ఇతర పూర్తి వివరాల కోసం ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













