తెలంగాణలో ప్రసిద్ధిచెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతి పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి ఆలయం. ఈ దేవాలయం పేదల తిరుపతిగా వెలుగొందుతుంది. ఇక్కడి దేవరగట్టుపైనున్న కాంచన గుహలో శ్రీ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ సమేతంగా స్వయం భువుగా కొలువై ఉన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతీరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కురుమూర్తిలో కొలువైన స్వామి విగ్రహం తిరుపతి వేంకటేశ్వర స్వామి మూర్తిని పోలి ఉంటుంది. అందుకే ఇక్కడికి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.
సుమారు 10లక్షల మంది..
ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి (నవంబర్ 2) నుంచి ఈ నెల 18వ తేది వరకు ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక, ఈ ఉత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు.
ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామి వారి అలంకరణ, ఉద్దాల మహోత్సవం, స్వామి వారి కళ్యాణం ప్రధాన ఘట్టాలు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి క్షేత్ర ఆవరణవంటివన్నీ ఉంటాయి. ప్రధాన ఘట్టాలతో పాటు, బ్రహ్మోత్సవాలకు దాదాపు 10లక్షల మంది భక్తులు హజరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ రూట్లలో స్పెషల్ బస్సులు...
ఇక, కురుమూర్తి జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్న్యూస్ను చెప్పింది. కురుమూర్తి జాతరకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, అధికారులు అంటున్నారు. ఎమ్జిబిఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్నగర్ మీదుగా జాతరకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా అధికారులు కల్పించారు. భక్తులు, ప్రయాణికులు టికెట్ల బుకింగ్ కోసం టీజీఎస్ఆర్టిసి అధికారిక http://tgsrtcbus.in వెబ్సైట్ను సంప్రదించగలరు.
బ్రహ్మోత్సవాల విశేషాలు..
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉద్దాల(పాదుకలు) ఊరేగింపు ఉత్సవం ప్రధాన ఘట్టంగా ఉంటుంది. ఈ వేడుకలో భాగంగా మొదట పల్లమర్రి నుంచి చాటను వడ్డేమాన్ గ్రామం వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ తర్వాత అక్కడే నియమ నిష్ఠలతో స్వామివారి పాదుకలను తయారు చేస్తారు. అక్కడి నుంచి కురుమూర్తి దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఇక, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. శ్రీవారి ఉద్దాలను దర్శిస్తే అంత మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.
సుమారు 900 సంవత్సరాల నుండి ఇక్కడ స్వామి వారు పూజలు అందుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ బ్రహ్మోత్సవాలకు దాదాపు 500 మంది పోలీసులతో జాతర ప్రాగణంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు భక్తుల భద్రత కోసం పోలీస్ కంట్రోల్ రూం నుంచి సీసీ కెమరాలతో పర్యవేక్షించనున్నారు. భక్తులకు కాల క్షేపంతో పాటు, వారిని చైతన్య పరిచేందుకు కళాజాతాలు, నాటక ప్రదర్శనలు, సంగీత విభావరుల వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ జాతరకు వెళ్లేందుకు సిద్ధంకండి..



Click it and Unblock the Notifications













