దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ప్రతి సంవత్సరం రైల్వేలో 30 నుంచి 35కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే, రైల్వేలో టికెట్ ధర తక్కువ, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది రైలు ప్రయాణానికే ఆసక్తి కనబరుస్తుంటారు. అంతేకాదు, దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా ముందస్తుగా టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ షాకిచ్చింది.
రైల్వే టికెట్ ముందస్తు రిజర్వేషన్ రూల్స్లో భారతీయ రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. రైల్వే టికెట్ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఇకనుంచి 60 రోజుల ముందు నుంచి మాత్రమే ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. భారతీయ రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే (నవంబర్) నెల 1వ తేది నుంచి అమల్లోకి రానుంది.
ఇతర సైట్లు..
ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఐఆర్సిటిసీ కీలక మార్పులు చేసింది. ఇది నవంబర్ ఒకటో తేది నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు ఈ నిబంధన వర్తించదన్న విషయాన్ని రైల్వేశాఖ తెలిపింది. రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఐఆర్సీటీసీ. ఇతర చాలా సైట్లు రైల్వే టికెట్ల బుకింగ్ సేవలను అందిస్తున్నా, చివరికి అవి ఐఆర్సీటీసీ సర్వర్ ద్వారానే బుక్ చేస్తాయి. రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని రైల్వేశాఖ తగ్గించింది. నవంబర్ 1వ తేది నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

వారికి వర్తించదు..
అయితే, ఈ నిబంధన నవంబర్1 నుంచి అమల్లోకి వస్తున్నందున, అక్టోబర్ 31వరకు 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని బుక్ చేసుకున్నవారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి బుకింగ్ రద్దు చేయడం జరగదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వారు తమ బుకింగ్ ప్రకారం ప్రయాణాలు చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.
గతంలో ఇదే పద్ధతి..
ఇదిలా ఉండగా, తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్లో రైల్వేశాఖ ఎలాంటి మార్పూ చేయలేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగానే ఉంది. అందువల్లే ఎలాంటి మార్పూ లేదు. ఇక విదేశీ పర్యటకుల బుకింగ్లో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికే వీరికి 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా ఇందులో రైల్వేశాఖ ఎలాంటి మార్పూ చేయలేదు.
వారికి పాత సదుపాయమే కొనసాగుతుందని, వీదేశీయులకు 60 రోజుల నిబంధన వర్తించదని రైల్వే అధికారులు పేర్కొ్న్నారు. గతంలో రైల్వే టిక్కెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ 60 రోజులకే ఉండేది. అయితే, 2015 మార్చి 25న రైల్వే శాఖ ఏఆర్పీని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచింది. తాజాగా, ఇప్పడు మరోసారి రైల్వేశాఖ 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది.



Click it and Unblock the Notifications













