రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు విపరీతమైన ఎండలతో, అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. గతనెలలో విపరీతమైన ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరిపోయారు. మే నెల మొదటి నుంచి కూడా భానుడు తనప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అయితే, గత రెండు రోజుల నుంచి తెలంగాణలో కాస్త వాతావరణం చల్లబడింది. భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఇక, మంగళవారం సాయంత్రం నుంచి ఏపీ వాతావరణంలో పలు మార్పులు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు తమిళనాడు మీదగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఇక, కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు బయటికి రాకపోవడం మంచిదని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు..
ఇదిలా ఉండగా, ఏపీలోని 39 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటలకు వరకు భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు 130.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మిల్లిమీటర్ల వర్షపాతం, కడియంలో 114 మిల్లీమీటర్ల వర్షపాతం, కోనసీమ జిల్లా మండపేటలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 102మిల్లీమీటర్ల వర్షపాతం,
ప్రకాశం జిల్లా మార్కాపురంలో 98.4మిల్లీమీటర్ల వర్షపాతం, వైయస్ఆర్ జిల్లా రాజుపాలెం 95.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.ఇక, నేడు (గురువారం) కోస్తాలోని శ్రీకాకుళంలో 4, విజయనగరం 3, పార్వతీపురంమన్యం 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. బుధవారం కర్నూలు జిల్లా జి. సింగవరంలో 39.7°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 39.4°C, అల్లూరి జిల్లా కొండైగూడెం, అనంతరం కురువల్లిలో 39.3°C, అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో 39.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు..
తెలంగాణలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు తగ్గి, ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. గురు శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండి వెల్లడించింది.
ఇక, ఈనెల 12 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు, జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి రెండు మూడు రోజుల పాటు ప్రజలకు ఉపశమనం దక్కనుందని అధికారులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications













