మండుటెండలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఐఎండి తీపికబురు చెప్పింది. త్వరలోనే వర్ష సూచన ఉందని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. ఈ ప్రకటనతో సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులు వారి వారి ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్లోని ఈ వారంలో తెలికపాటి జల్లులు సందడి చేయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇప్పటికే, ఎల్ నినో ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించ విషయం తెలిసిందే. ఈ ఏడాది వేసవి గత సంవత్సరం కంటే అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, ఎండల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.
ఎండలు, వదగాలులతో ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల ప్రభావంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో పర్యాకట ప్రదేశాలు సైతం వెలవెలబోతున్నాయని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలులు కూడా ఎక్కువగా వీస్తున్న క్రమంలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలని భావించేవారు వారి నిర్ణయాన్ని పక్కన పెడుతున్నారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి తియ్యని కబురు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో వర్ష సూచన ఉందని, మండే ఈ ఉష్ణతాపం నుంచి కాస్త ఉపశమనం దొరకబోతోందని తెలిపింది. అయితే, ఈ ఏప్రిల్ ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీలలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ వెల్లడించింది. ఈ రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
ఠారెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు..
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భాగ్యనగరం హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో పాటుగా వడగాలులు వీస్తున్న క్రమంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అత్యధికంగా మూసాపేటలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత, చందానగర్, ఖైరతాబాద్ లలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ చేసిన ప్రకటన నగర ప్రజల్లో ఉపశమనాన్ని కలిస్తుందనడంలో సందేహమే లేదు.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఔత్సాహిక పర్యాటక ప్రియులు తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సెలవుల నేపథ్యంలో కుటుంబసమేతంగా పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది నిజంగా తీపికబురనే చెప్పాలి. మరెందుకు ఆసల్యం.. ఈ వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కావాలనుకుంటే మీరూ తెలంగాణ రాష్ట్రంలోని సందర్శనీయ ప్రదేశాలను విజిట్ చేసేలా ప్లాన్ చేసుకోండి మరి!



Click it and Unblock the Notifications













