విమాన ప్రయాణం చాలా మంది కల. ఎందుకంటే, ఆ ప్రయాణం ఖరీదైనది. అయితే, అలాంటివారి కలను నిజం చేసేందుకు ముందుకు వచ్చింది ఫ్లై 91 ఎయిర్లైన్స్. కేవలం బస్సు టికెట్ ధరకే విమాన ప్రయాణం చేసే గొప్ప ఆఫర్ను ప్రకటించి.. సంచలనం సృష్టించింది. ఈ ఒక్క ప్రకటనతో ఎన్నో ఏళ్లుగా తమకు కలగా మిగిలిపోయిన విమాన ప్రయాణం నెరవేరబోతోందని ఔత్సాహికులు ఎగిరి గంతేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఫ్లై 91 ఎయిర్లైన్స్ ఇవ్వబోయే ఆఫర్ ఏంటి? ఎక్కడెక్కడకు ఇది వర్తిస్తుంది.. తెలుసుకుందా పదండి!
ఫ్లై 91 ఎయిర్లైన్స్ దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టి, మార్చి 18న తొలి ఫ్లైట్ సర్వీసులను పరిచయం చేసింది. గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 7.55 గంటలకు మొదటి విమానం బయలు దేరింది. తాజాగా దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విమాన సేవలను చేరువచేయడం ద్వారా విమాన సర్వీసులు అందరికీ అందుబాటులోకి తేబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రయాణీకులకు అధిరిపోయే ఆఫర్ను ప్రకటించారు. విమాన టికెట్ ధర తక్కువకే అందించనున్నట్లు తెలిపారు. అదికూడా కేవలం బస్ టికెట్ ధరకే అందించనున్నట్లు ప్రకటించి.. అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని రూట్ల సర్వీసుల్లో తమ ఫ్లైట్ టికెట్ ధర కేవలం రూ.1991 మాత్రమే ఉండనున్నట్లు ప్రకటించారు.
అందుబాటులోకి వారంలో మూడు రోజుల సర్వీసు
అంతేకాదు, ఫ్లై 91 విమాన సర్వీసులు అన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. కేవలం కమర్షియల్ మార్కెట్లో తమ విమాన సేవలను ప్రారంభించిన మొదటి రోజే ఫ్లై 91 ఎయిర్ లైన్స్ ఈ ఆఫర్ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. విమాన టికెట్ ధర రూ.1991 (అన్నింటితో కలిపి) ప్రత్యేక ఛార్జీ సదుపాయాన్ని అందించబోతోంది. మొదటగా గోవా, హైదరాబాద్, బెంగళూరు, సింధుదూర్గ్ మధ్య విమాన సర్వీసులను ఈ కంపెనీ ప్రారంభించింది.

అలాగే, ఏప్రిల్లో అగత్తి, జలగావ్, పుణెకు విమాన సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. గోవా- బెంగళూరు మధ్య సోమ, శుక్ర, శనివారాల్లో ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు- సింధుదుర్గ్ మధ్య కూడా ఇదే సంఖ్యలో విమాన సర్వీసులు ఉండనున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం..
అలాగే, మన తెలుగు రాష్ట్రాల ప్రజల విమాన ప్రయాణం ఆశను నెరవేర్చేందుకు ఫ్లై 91 ముందుకొచ్చింది. గోవా- హైదరాబాద్, సింధుదుర్గ్- హైదరాబాద్ మధ్యలో విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఈ సర్వీసులు వారంలో రెండు సార్లు హైదరాబాద్కు ఈ రెండు ప్రాంతాల నుంచి నడపనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఫ్లై 91 కంపెనీ వద్ద రెండు ఏటీఆర్ 72- 600 విమానాలు అందుబాటులో ఉండగా, వచ్చే కొన్ని నెలల్లోనే మరో నాలుగు విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడాన్లో భాగంగా సింధుదుర్గ్, జల్గావూన్, నాందేడ్, అగత్తి, బెంగళూరు, గోవా, హైదరాబాద్, పుణె మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి తేనున్నట్లు ఫ్లై 91 సంస్థ వెల్లడించింది.



Click it and Unblock the Notifications













