భాగ్యనగరవాసులకు మెట్రో సేవలు మరింత చేరువకానున్నాయి. సిటీలో మెట్రోరైలు రెండో దశ ప్రణాళికలో భాగంగా ఎల్బీనగర్-హయత్నగర్ మార్గంలో 6 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్ మ్యాప్లో దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండగా ఒక్కో కిలోమీటరుకూ ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గంలో కిలోమీటరుకు కాస్త అటుఇటుగా ఒక స్టేషన్ను ఇప్పటికే ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే నగరవాసులకు మెట్రో సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. నిజానికి, హయత్నగర్ నుంచి నిత్యం ఎంతోమంది సిటీలోని వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడార్కు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రహదారిపై రద్దీ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదుర్కుంటూ వస్తున్నారు. తాజాగా ఈ మార్గంలో మెట్రో వస్తుండడంతో ఇక్కడ ప్రయాణం మరింత సులభతరం కానుంది.
అత్యంత రద్దీ మార్గంగా..
నగరంలో మెట్రోరైలు రెండోదశలో వేర్వేరు మార్గాల్లో 70 కి.మీ. నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందులో ఎల్బీనగర్-హయత్నగర్ మార్గం కూడా ఒకటి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1కి పొడిగింపుగా ఇది ఉంది. ఎల్బీనగర్-హయత్నగర్ మెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదిత ప్రాంతం జాతీయ రహదారి కావడంతోపాటు కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం నేపథ్యంలో మెట్రో పనుల కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రహదారికి ఎటువైపు ఉన్నా ప్రయాణికులు సులభంగా మెట్రో స్టేషన్కు చేరుకునేందుకు స్టేషన్ ఏర్పాటు ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. అందుకు అనుగుణంగా జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రోరైలు అధికారులు డీపీఆర్ రూపకల్పన చేశారు. నిజానికి, హయత్నగర్- ఎల్బీనగర్ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. అంతేకాకుండా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉండే ఈ మార్గాన్ని ఈమధ్య కాలంలోనే ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. ఈ సమయంలో మెట్రో కూడా అందుబాటులోకి వస్తుండడంతో ప్రజలకు చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
సర్వీస్రోడ్డులో మెట్రోమార్గం..
ఎల్బీనగర్-హయత్నగర్ మెట్రో మార్గంలోనే చింతలకుంట వద్ద మెట్రో స్టేషన్ ప్రతిపాదన ఉంది. ఎల్బీనగర్ నుంచి ఇక్కడి వరకు రోడ్డు మధ్యలో మెట్రో మార్గం రాబోతోంది. ఆరు స్టేషన్ల ప్రతిపాదనలో మిగిలిన ఐదు స్టేషన్లు ఎక్కడెక్కడ అనేదానిపై చర్చులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన రహదారిపై ప్లైఓర్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో చింతలకుంట నుంచి హయత్నగర్ మధ్య రోడ్డుకు ఎడమవైపున ఉన్న సర్వీస్రోడ్డులో మెట్రోమార్గం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి స్టేషన్లు సైతం విజయవాడకు వెళ్లే మార్గంలో ఎడమవైపే ఉండనున్నాయి. అయితే కుడివైపు నుంచి స్టేషన్లకు చేరుకునే వారి కోసం రోడ్డుకు అవతలి వైపు ప్రత్యేకంగా బ్రిడ్జ్ను ఏర్పాటు చేయనున్నారు.
తాజాగా మెట్రో హయత్నగర్ వరకు విస్తరిస్తుండటం సాధారణ ప్రయాణికుల కంటే ఐటీ ఉద్యోగులకు వరంలా మారుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతోపాటు బీహెచ్ఈఎల్ ప్రాంతంలోనూ పైవంతెన పక్క నుంచి మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో గంగారం వద్ద డబుల్ డెక్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాధనలన్నీ పట్టాలెక్కితే.. భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి పొందినట్లవుతుంది.



Click it and Unblock the Notifications













