ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చిల్లర కష్టాలను దూరం చేస్తూ.. సాఫీ ప్రయాణం కోసం టీజీఎస్ ఆర్టీసీ కూడా డిజిటల్ పేమెంట్స్ బాటలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్నంగా చిరుధాన్యాల స్నాక్స్ను పరిచయం చేసిన టీజీఆర్టీసీ తాజాగా డిజిటల్ పేమెంట్స్కు అవకాశం కల్పిస్తోంది. వచ్చేనెల ఆగస్టు నెలలోపు సిటీ సర్వీసుల్లో, సెప్టెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ తరహా పేమెంట్స్ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు చేస్తోంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మాత్రం నగరవాసులకు చిల్లల కష్టాలు తీరినట్లే!
నిజానికి, తెలంగాణ ఆర్టీసీలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు డిజిటల్ చెల్లింపుల సదుపాయం కల్పించింది. అయితే, ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ వినియోగం అన్నిచోట్లా విస్తరించడంతోపాటు చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. సిటీ నుంచి పల్లెల వరకూ ప్రజలు క్యాష్లెస్ పేమెంట్స్కు అలవాటు పడ్డారు. ఈ కారణంగా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా టికెట్ కోసం ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా టీజీఎస్ఆర్టీసీ ప్లాన్ను అమలు చేస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాదిరిగానే ఆర్డీనరీ బస్సుల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ..
తెలంగాణ ఆర్టీసీలోని తొమ్మిది వేల బస్సుల్లో సగటున రోజుకు 55 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుతం కండక్టర్లు టికెట్లు జారీ చేసేందుకు సిటీ, పల్లె బస్సుల్లో సాధారణ టిమ్లు ఉపయోగిస్తున్నారు. వీటి కేవలం నగదు చెల్లింపు టికెట్లు జారీ మాత్రమే అవుతోంది. అయితే, తాజాగా డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల్లో భాగంగా కండక్టర్లకు ఐ-టిమ్స్ను అందించనున్నారు. ఈ టిమ్స్ ద్వారా టికెట్ డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ప్రయాణికులకు అవకాశం ఇవ్వనున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టబోతోన్న ఈ ఐ-టిమ్స్తో డెబిట్ కార్డులు, క్యూ ఆర్ కోడ్ స్కాన్తో యూపీఐ చెల్లింపులకు అవకాశం ఉంది. ఇప్పుడున్న సాధారణ టిమ్స్ వల్ల బస్సులు సాయంత్రం డిపోనకు వచ్చిన తర్వాత కానీ ఏ సర్వీసు నుంచి ఎంత ఆదాయం వచ్చిందన్న విషయం తెలీదు అధికారులకు తెలియదు. అయితే, ఐ టిమ్స్ కారణంగా బస్సు కదలికలు, సిబ్బంది పని తీరు, ఆదాయం తదితర విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తోందట! పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని బండ్లగూడ, దిల్సుఖ్నగర్ సిటీ బస్సుల్లో ఐ-టిమ్స్ వినియోగిస్తున్నారు.
మహిళలకు స్మార్ట్ కార్డులు..
అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బస్సుల్లో ఆధార్ కార్డులు చూసి జీరో టికెట్లు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ విధానానికి స్వస్తిపలికేలా ఇకపై మహిళలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు అందించనున్నట్లు సమాచారం.
ఆ కార్డుల్ని స్వైప్ చేయడం ద్వారా బస్సు ప్రయాణంలో జీరో టికెట్ తీసుకోవచ్చు. మొత్తానికి ఈ ఐ టిప్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. అటు చిల్లర కష్టాలు తీరడంతోపాటు ఇటు మహిళల ఉచిత ప్రయాణం కూడా సాఫీగా సాగిపోతుంది అంటున్నారు ప్రయాణికులు.



Click it and Unblock the Notifications













