గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 19వ తేదీన వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీ వరకు కోస్తాలో వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లదలచినవారు అవకాశం ఉన్నంత వరకూ తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గడిచిన రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో అత్యధికంగా 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా విజయవాడలో సోమవారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సంబల్పూర్, పూరీ మీదుగా రుతుపవన ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు.
అలాగే, ఒడిశా మీదుగా తూర్పు, పడమరకు ఒక ద్రోణి, అరేబియా సముద్ర తీరం వెంబడి కేరళ నుంచి గుజరాత్ వరకు మరో ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతోనే దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరో అల్పపీడనంతో..
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా ఈ నెల 19 నుంచి రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం(జూలై 16) రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు, బుధవారం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని అంచనా వేసింది.
గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాతావరణం కారణంగా సముద్రం అలజడిగా ఉండనున్నట్లు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.

ప్రయాణాల వాయిదా మంచిది..
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు పర్యాటక కేంద్రాలలో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అయితే, ప్రయాణం సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మీరు కూడా కుటుంబసమేతంగా టూర్ ప్లాన్ చేసి ఉంటే మాత్రం, వెంటనే మీ రూట్ మ్యాప్ను మార్చుకోండి!



Click it and Unblock the Notifications













