దేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉంది హైదరాబాద్ హౌస్. 94 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ భవనం భారత దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. దౌత్య విందులతోపాటు భారత్ను సందర్శించే విదేశీ ప్రముఖుల సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉపయోగించే ఈ హైదరాబాద్ హౌస్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దశాబ్దాలుగా గౌరవ మర్యాదలకు చిహ్నంగా నిలుస్తోన్న హైదరాబాద్ హౌస్ విశేషాలను తెలుసుకుందాం..
దౌత్య కార్యక్రమాలకు వేదికగా..
హైదరాబాద్ హౌస్ అనేది భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని ఒక భవనం. హైదరాబాద్ చివరి నిజాం కోసం ఎడ్విన్ లుటియన్స్ రూపొందించిన ఈ భవనం ఇప్పుడు దౌత్య కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. దీనిని భారత ప్రభుత్వం విందులకు, విదేశీ అతిథి గృహంగా, భారత్ను సందర్శించే విదేశీ ప్రముఖులతో సమావేశాలకు వేదికగా ఉపయోగిస్తుంది. మొత్తం 8.77 ఎకరాలలో విస్తరించి, ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్లో సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించబడింది. ఆకట్టుకునే ఆకృతిలో ప్యాలెస్ ప్రవేశ హాలు, యాభై-ఐదు డిగ్రీల కోణంలో సౌష్టవమైన రెక్కలతో కింద ప్రవేశ మార్గంతో కూడిన గోపురం ఒక అద్భుతమైన వీక్షణగా చెప్పొచ్చు.

ఇది ఒక జెనానాతో(మహిళలకు కేటాయించిన గదులు) సహా 36 గదులను కలిగి ఉంటుంది. వీటిలో నాలుగు గదులు ఇప్పుడు భోజనాల గదులుగా మార్చబడ్డాయి. ఇది ఇండియా గేట్ వాయువ్యంగా ఉంది. నగరంలోని సందర్శనీయ ప్రదేశాలకు చేరువలో ఉండడంతో దీనిని చూసేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు.
సీతాకోక చిలుక ఆకృతిలో..
చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ భవన నిర్మాణ బాధ్యతను నిజాం నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్కు అప్పగించారు. లుటియన్స్ 'హైదరాబాద్ హౌస్' కోసం దాదాపు 'వైస్రాయ్ హౌస్'ను పోలి ఉండేలా 'సీతాకోకచిలుక' ఆకారంలో దీని ఆకృతిని డిజైన్ చేశాడు. ఈ భవన నిర్మాణానికి స్వాతంత్య్రం వచ్చే సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం 'హైదరాబాద్ హౌస్'కు రూ.50 లక్షల వరకూ ఖర్చు చేశాడు. అంతేకాదు, ఆ రోజుల్లో ప్రస్తుత మయన్మార్కు చెందిన టేకు చెక్కను భవనంలోని ఇంటీరియల్కు కలపగా వినియోగించారు. అలాగే, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి తెప్పించి, ఉపయోగించారు.
కేంద్రం ఆధీనంలోకి హైదరాబాద్ హౌస్..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని సంస్థానాలన్నీ విలీనమయ్యాయి. దీంతో 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'హైదరాబాద్ హౌస్'ని లీజుకు తీసుకుంది. అందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తూ వచ్చింది. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో 'హైదరాబాద్ హౌస్' కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయింది. అలా ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌసెను పర్యవేక్షిస్తోంది. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ భవనాన్ని మీ టూర్ ప్లాన్లో చేర్చడం అస్సలు మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications













