భారతీయ రైల్వే.. ప్రయాణీకుల సౌలభ్యం కోసం నిత్యం అనేక నూతన ఆవిష్కరణలకు తెరలేపుతుందని మనకు తెలుసు. అందులో భాగంగా దేశంలో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎంతో ఆదరణ పొందుతోన్న వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు డిసెంబర్ 30న భారతీయ రైలు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. అధునాతన సౌకర్యాలతో ఉన్న ఈ రైళ్లలో ఒక ఒక రైలు ఢిల్లీ-దర్బంగా(బిహార్) మార్గంలో, మరో రైలు బెంగాల్లోని మాల్టా- బెంగళూరు మధ్య అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత వర్గాల ద్వారా సమాచారం. తాజాగా ఈ రైలుకు సంబందించిన మరింత సమాచారాన్ని చూద్దాం.
పర్యాటక ప్రేమికులకు భారతీయ రైల్వేతో విడదీయరాని బంధముంది అనడంలో సందేహమే లేదు. వారి అవసరాలకు అనుగుణంగా నిత్యం తమ ప్రణాళికలను మార్చుతూ సరికొత్త ఆవిష్కరణలతో ప్రయాణీకులను ఆకర్షిస్తోంది రైల్వే. తాజాగా అలాంటి సరికొత్త రైలును పట్టాలపైకి తెచ్చేందుకు సిద్ధమైంది. అయోధ్యలోని ఓ విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లను ప్రధాని మోఢీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలకు కూడా పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. ఇందులో ఒక రైలు ఢిల్లీ-దర్బంగా(బిహార్) మార్గంలో, మరో రైలు బెంగాల్లోని మాల్టా- బెంగళూరు మధ్య అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రి పూట సర్వీసులను నడిపే ఆలోచనలో రైల్వే ఉన్నట్లు సమాచారం.

అమృత్ భారత్ ప్రత్యేకతలు..
కొత్తగా రాబోతోన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని అధునాత సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి పూర్తిగా నాన్ ఏసీ, పుష్-పుల్ రైళ్లు. ఈ రైలుకు ముందు భాగంతోపాటు వెనుక కూడా ఇంజన్లు అందించనున్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు మరింత వేగాన్ని అందుకోవడంతోపాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో మొత్తంగా 22 కోచ్లను ఏర్పాటు చేశారు. వాటిలో 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్కు కేటాయించారు. మిగిలిన 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లుగా, రెండు గార్డు కంపార్ట్మెంట్స్ రూపొందించారు. ఈ రెండు కంపార్ట్మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు.
గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో
ఇందులో ఒక ట్రిప్కు 1800 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. రైలులో సీసీటీవీ కెమెరాలు, సెన్సార్ ట్యాప్లు, బయో వాక్యూమ్ టాయిలెట్లు, ప్రతి సీటుపై ఛార్జర్లు, ఆధునిక స్విచ్లు, ఫ్యాన్లు, ప్రయాణికులకు సమాచారం అందించే అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రైలు టికెట్ ధరలు ఎంత ఉండబోతున్నాయి, వీటిని ఏయే ప్రాంతాల్లో తీసుకురానున్నారు? లాంటి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ రైళ్లు వలస వచ్చే వారికి ఉపయోగపడేలా ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications













