దేశంలో రైలు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఐఆర్సీటిసి ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. టికెట్లను మొదలుకుని ఆహారం వరకూ అన్నింటా దీని పాత్ర ఉంటుంది. తాజాగా ఐఆర్సీటిసి తీసుకున్న ఓ నిర్ణయంతో రైలు ప్రయాణికుల ప్రసంశలు అందుకుంటోంది. ప్రయాణికులకు నచ్చిన, మెచ్చిన ఆహారాన్ని.. వారికి కావాల్సిన ప్రదేశం నుంచి అందించేందుకు ఐఆర్సిటిసీ తీసుకొస్తోన్న ఆ సరికొత్త ప్లానేంటో చూద్దాం.
భారతదేశ రవాణా వ్యవస్థలో రైలు ప్రయాణం మొదటి స్థానంలో ఉంటుంది. రోజూ లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత రైల్వేశాఖ నిర్విరామంగా కొనసాగిస్తోంది. సుదూర ప్రాంతాలకు అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లో చేరవేయగల సాధనంగా మన రైల్వే గుర్తింపు పొందింది. దీనిని మిడిల్ క్లాస్ నేల విమానం అని మనవాళ్లు ముద్దుగా పిలుచుకుంటారు. దశాబ్ధాలుగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే అనేకచర్యలు తీసుకుంటూ వస్తోంది.
ప్రయాణికులు టికెట్లను కొనుగోలు చేసింది మొదలు.. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్లే వరకూ వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మన దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్గా పేరొందిన స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

నాలుగు ప్రధాన రైల్వే్ స్టేషన్లలో ఈ సర్వీసులు
ఈ ఒప్పందం ప్రకారం.. రైలులో ప్రయాణం చేస్తుండగా ప్రయాణికులు ఆర్డర్ చేసిన భోజనాన్ని వారికి అందించేందుకు స్విగ్గీ, ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే, ప్రయాణం ఉన్న సమయంలో రాబోయే ప్రాంతంలో మనకి కావాల్సిన ఆహారాన్ని, కావాల్సిన ప్రదేశం నుంచి ముందుగా బుక్ చేసుకుంటే చాలు.. ట్రైన్ ఆ స్టేషన్ దగ్గరకు రాగానే వేడి వేడి ఫుడ్ ఐటమ్ మన చేతికి అందుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా తొలుత దేశంలోని నాలుగు ప్రధాన రైల్వే్ స్టేషన్లలో ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.
అన్ని రుచులను ఆస్వాదించే అవకాశం
ఫుడ్ డిలవరీలో భాగంగా జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ముందుగా.. విజయవాడ, విశాఖఫట్నం, బెంగళూరు, భువనేశ్వర్లో ఐఆర్సీటీసీ కస్టమర్లకు స్విగ్గీ ఈ సేవలు అందించనుందట. ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందుగా ఆర్డర్ బుక్ చేసుకున్నవారికి స్విగ్గీ డెలివరీ బాయ్లు ఈ ఆహారాన్ని స్టేషన్లోనే అందిస్తారు. బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ క్యాటరింగ్ సర్వీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో నాలుగు స్టేషన్లలో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగతా స్టేషన్లలో అమలు చేయనున్నారు. దీంతో రైలు ప్రయాణికులు తమ ప్రయాణంలో అన్ని ప్రాంతాల రుచులను ఆస్వాదించే అవకాశం ఉంటుందని రైల్వే అభిప్రాయపడుతోంది.
ఏపీ నుంచి రెండు రైల్వే స్టేషన్లు
అంతేకాదు, ఈ ఒప్పందం ద్వారా రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారం అందించడం ద్వారా ప్రయాణికుల వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లతో ఐఆర్సీటీసీ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కాదండోయ్. గతంలోనే ఢిల్లీ, ప్రయాగ్రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసితో సహా పలు రైల్వే స్టేషన్లలో ఆహారం అందించేందుకు జొమాటోతో ఒప్పందం చేసుకుందని మర్చిపోవద్దు. తాజాగా స్విగ్గీతో ఈ రకమైన ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండు రైల్వే స్టేషన్లు ఉండడంతో తెలుగు ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు.



Click it and Unblock the Notifications













