ఏపీలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో దాగి ఉన్నాయి. అయితే, ఇక్కడ ప్రతి ఒక్క ప్రాంతంలో అక్కడి స్థానిక అమ్మవార్లు కొలువై ఉన్నారు. వారికి ప్రత్యేకంగా జాతరలు, ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసిన గ్రామదేవతలు, ఉత్సవాలు, పండుగలు, వారాలు వంటివి ప్రసిద్ధిచెందాయి. ఇక, ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మవారు ఇక్కడి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా కొలువై ఉన్నారు. ప్రతి ఏటా ఇక్కడ కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక, ఈ ఏడాది కూడా ఈజాతర రానే వచ్చింది. నేటి (అక్టోబర్ 1) నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతం సందడి చేయనుంది.
ఇక, కొత్తమ్మ తల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దేవాదాయ శాఖ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కోటబొమ్మాళిలోని ఈ ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్నీ ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా వారి కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మహాజాతర ఉత్సవాలు మంగళవారం నుంచి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
రాష్ట్ర పండుగగా...
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతరను దేవదాయశాఖ రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు దేవదాయశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ జాతర నిర్వహణకు రూ.1 కోటి మంజూరు చేసినట్లు కూడా దేవదాయ శాఖ పేర్కొంది. ఈ మహాజాతర సందర్భంగా అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మహాజాతర ఉత్సవాలకు కేవలం ఏపీ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా తరలివస్తారు. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి, తమ మొక్కులు చెల్లించుకుంటారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు...
గురువారం కొత్తమ్మ తల్లి అమ్మవారికి ప్రీతికరమైన రోజు. ఆది, మంగళవారాల్లో ఎక్కువగా ఈ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ భక్తుల తాకిడి పెరిగిన క్రమంలో 1985లోనే కొత్తమ్మతల్లి ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి చేరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక, అదే సంవత్సరం నుంచి కూడా ధర్మకర్తల మండలిని నియమిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు కొత్తమ్మ తల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మహాజాతర సందర్భంగా ఏఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా ఎనిమిది మంది సీఐలు, 23 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులు, 200 మంది హోంగార్డులతో పాటు మహిళా పోలీసులు, మూడు ప్రత్యేక బలగాలు ఇలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇక్కడికి విచ్చేసే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొత్తమ్మతల్లి ఆలయం నుంచి కొత్తపేట, సంతబొమ్మాళి వైపు నాలుగు ప్రాంతాల్లో బారికేడ్లతో ట్రాఫిక్ నియంత్రణకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఒకే దారి కావడంతో వాహనాలను నియంత్రిస్తూ భక్తులు రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
మిరుమిట్లు గొలుపుతున్న లైట్లు..
ఈ మహాజాతరలో భాగంగా ఆలయం, కోటబొమ్మాళి, కొత్తపేట ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 80 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరంతా టెక్కలి, సోంపేట, పాతపట్నం వాసులే. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 40 మందికి పైగా సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఆరుగురు వైద్యులు, 108 వాహనంతో సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.



Click it and Unblock the Notifications













