సింహవాహిని మహంకాళి బోనాల మహోత్సవానికి భాగ్యనరంలోని పాతబస్తీ ముస్తాబయింది. జాతరను పురస్కరించుకుని లాల్ దర్వాజ అలంకరణలతో సిద్ధమైంది. పాతబస్తీలోని సింహవాహిని ఆలయంతో పాటు మరో 330 ఆలయాలను చూడముచ్చటగా ముస్తాబుచేశారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లుతోపాటు పెద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
రేపు ఆదివారం(జూలై 28) తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ, 4 గంటలకు బలిహరణ, ఉదయం 5.30 గంటలకు దేవి మహాభిషేకం నిర్వహించనున్నారు. తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిని ఇస్తారు. అలాగే, ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నగరంలోని ఆలయాలన్నీ కూడా మిరుమెట్లు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.
వాహనాల దారి మళ్లింపు ఇలా..
ఈ లాల్దర్వాజ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల వాహనాల దారి మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. హిమ్మత్పురా నుంచి షంషీర్గంజ్ వైపు వెళ్లే వాహనాలను గౌలిపురా, సుధా టాకీస్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే, చాంద్రాయణగుట్ట, ఉప్పగూడ నుంచి సిటీకి వచ్చే వాహనాలను గౌలిపుర, నాగుల్చింత మీదుగా పంపిస్తారు. మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను జహనుమా, గోశాల, తాడ్బాన్, ఖిలావత్ మీదుగా అనుమతిస్తారు.

ఇంజిన్ బౌలి నుండి వచ్చే వాహనాలను షంషీర్గంజ్ వైపు, చార్మినార్ నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి వద్ద, చాదర్ఘాట్ నుంచి వచ్చే వాహనాలను పురానా హవేలీ రోడ్డు వద్ద, శివాజీ బ్రిడ్జి వద్దకు అనుమతిస్తారు. మొగల్పురా, మీర్చౌక్ నుంచి వచ్చే వాహనాలను మీర్ కా డియారా వైపు తిప్పేలా ఆంక్షలు విధించారు. వాహనదారులు ఈ రూట్ మ్యాప్ను తప్పనిసరిగా అనుసరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
లాల్ దర్వాజ బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2,500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, పాత బస్తీలోని ఫలక్నుమా, చార్మినార్, బహుదూర్పురా, మీర్చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేపు ఆదివారం, సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. పాతబస్తీలో ఆదివారం బోనాల ఊరేగింపు, సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.
ఆది, సోమవారాల్లో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అక్కన్న మాదన్న దేవాలయం నుండి నయాపూల్ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగనుంది. ఈ మహోత్సవాలకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ నేపథ్యం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మీరు నగరంలోనే ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రాఫిక్ ఆంక్షలను మర్చిపోవద్దండోయ్.



Click it and Unblock the Notifications













