పడయాల్ రెస్టారెంట్లో పచ్చి ఆహారం మాత్రమే వడ్డిస్తారట!
ఏదైనా రెస్టారెంట్కు ఎందుకు వెళతాం. రుచికరమైన ఫుడ్ను టేస్ట్ చేసేందుకే కదా! అలా కొత్త రుచులను ఆస్వాదించేటప్పుడు ఏ మాత్రం ఉడకకపోయినా.. ఆయిల్ తగ్గినా.. ఆ ఫుడ్ అస్సలు నోటికి రుచించదు. ఇది సహజం. కానీ తమిళనాడులోని ఓ రెస్టారెంట్ మాత్రం తాము సర్వ్ చేసే ఆహార పదార్థాలలో ఆయిల్ను అస్సలు వినియోగించరట. అంతేకాదు, ఆహార పదార్ధాలను కనీసం ఉడకబెట్టరు కూడా. అయినప్పటికీ ఈ రెస్టారెంట్కు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. ఆ రెస్టారెంట్ విశేషాలను తెలుసుకుందాం రండి!
తమిళనాడు కొయంబత్తూరులోని పడయాల్ రెస్టారెంట్. ఇప్పుడు ఈ పేరు చాలా ట్రెండీగా మారిపోయింది. అందుకు కారణం ఇక్కడికి వచ్చే కస్టమర్లకు కేవలసం పచ్చి భోజనాన్ని వడ్డిస్తారు. అవును.. మీరు విన్నది నిజమే! నో ఆయిల్.. నో బాయిల్.. కాన్సెప్ట్తో ఈ రెస్టారెంట్లో ప్లేట్లో వడ్డించే ప్రతిదీ పూర్తిగా పచ్చిగా ఉంటుంది. రైతు కుటుంబం నుంచి వచ్చిన శాస్త్రవేత్త అయిన ఆర్ శివకుమార్ వినూత్న ఆలోచనలోంచి పుట్టింది ఈ పడయాల్ రెస్టారెంట్.

మనలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం అంటే టక్కున గుర్తుకువచ్చేవి సలాడ్ లే. అయితే దీనిని మరింత ప్రత్యేకంగా అందించాలనుకున్నరు శివకుమార్. అనుకున్నదే తడువుగా ఈ పచ్చి ఆహారం అమలు చేశారాయన. ఇందులో బిర్యానీ, శాండ్ విచ్, పొంగల్, పుట్టు అంటూ 2, 200 రకాల వంటకాలున్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇవన్నీ నూనె, ఉడకబెట్టటం వంటివి లేకుండా తయారు చేసినవేనండోయ్.
అప్పుడు పుట్టిన ఆలోచనే ఇలా..
శివకుమార్ నమ్మాళ్వార్ వనగం కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఆ సమావేశానికి భారతదేశం అంతటా సేంద్రీయ వ్యవసాయ మార్గదర్శకులు నలుమూలల నుంచి వచ్చారు. ఆ రోజు మధ్యాహ్న భోజనంలో అందరికీ, పచ్చి భోజనం అందించారు. అప్పుడు పుట్టిన ఆలోచనే ఇలా పచ్చి ఆహారాన్ని ప్రజలకు అందించాలనే సంకల్పంగా రూపుదాల్చింది.
దీనికి సంబంధించిన సాంకేతికతపై సమాచారాన్ని సేకరించడం ప్రారంభించి, తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాలకు వెళ్ళేలా చేసింది. ఆ తరువాతే శివకుమార్ క్రమంగా తన స్వంత వంటకాలను రూపొందించడం ప్రారంభించాడు.

కస్టమర్లకు ఇదో అదనపు ఆకర్షణ..
ఇక్కడి మధ్యాహ్న భోజనంలో అవల్ (చదునైన అన్నం)తో పాటు తురిమిన క్యారెట్ ముక్కలను అన్నం స్థానంలో వడ్డిస్తారు. తురిమిన కొబ్బరితో మెత్తగా తరిగిన బీట్రూట్ పోరియల్ పచ్చడి మెత్తగా తరిగిన పొట్లకాయతో తయారు చేస్తారు. సాంబార్ చిక్కగా, క్రీమీగా ఉంటుంది. పులి కుజంబు సాధారణంగా చేసే విధంగా నూనెలో ఈదదు, జామకాయ రసం నీళ్లతో ఉంటుంది. అయితే ఇది కొత్త ప్రయోగం అని మాత్రం అనుకుంటే పొరపాటే. సనాతన ఆయుర్వేదంలో పచ్చి కూరలను, ఆహారంగా తీసుకోవడం అనేది ఉందని., దానికి మోడ్రన్ రూపాన్ని మాత్రమే తాము పరిచయం చేస్తున్నామని అంటున్నారు నిర్వాహకులు. ఇక్కడ వళ్ళైపూ వడై, పొడి గింజలు, మెత్తగా రుబ్బిన అరటి పువ్వుల మిశ్రమంతో మెత్తగా ఉంటుంది, తేలికపాటి తీపి రుచిని ఇస్తుంది. మజ్జిగలో కొబ్బరి పాలు, గుమ్మడికాయ గింజలు ఉంటాయి.
పడయాల్ రెస్టారెంట్కు మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్. స్వతహాగా రెస్టారెంట్ యజమాని శివకుమార్ రైతు కుటుంబం నుంచి రావడంతో రైతు ఉద్యమకారుడైన జయరామన్ చిత్రాలు గోడల నిండా ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ఇదో అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మరెందుకు ఆలస్యం.. ఆ పచ్చి ఆహారపు రుచులను ఆస్వాదించేందుకు కోయంబత్తూరు బయలుదేరండి!



Click it and Unblock the Notifications













