సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది అమర్ నాథ్ యాత్ర. ఈ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో, అత్యంత కష్టతరమైన యాత్ర మరొకటి ఉందని మీకు తెలుసా..? అదే శ్రీఖండ్ యాత్ర. ఇది సముద్రమట్టానికి సుమారు 18, 570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది.
ఈ శివలింగాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు హరహర మహాదేవ అంటూ తమ యాత్రను చేపడతారు. ఇక్కడ కొలువై ఉన్న మహాశివుడు అత్యంత ప్రసిద్ధిచెందినదిగా అందరూ భావిస్తారు. ఈ హిమాలయ పర్వతంపై ఉన్న శ్రీఖండ్ పర్వతాల్లో వెలసిన శివలింగంలో అద్భుత శక్తులున్నాయని ఇక్కడికి వచ్చే వారి నమ్మకం. రండి ఇక్కడి విశేషాలు తెలుసుకుందాం.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
దేశంలోనే అత్యంత కష్టతరమైన పర్వతారోహణలలో ఒకటైన శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. శ్రీఖండ మహాదేవ్ యాత్ర ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇది ఏవ్యక్తి అయినా తన జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయగలడని చాలామంది నమ్మకం. ఇక, ఈ ప్రయాణం అమర్నాథ్ యాత్ర కంటే ఎంతో కష్టంగా ఉంటుందని చాలామంది చెబుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో శ్రీఖండ మహాదేవ్ ప్రయాణం ప్రారంభమవుతుంది. దీనిని 2014 నుండి అధికారికంగా కులు జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది. ఈ ప్రయాణం అమర్నాథ్ ధామ్ యాత్ర కంటే కష్టంగా భావించినప్పటికీ, ప్రతి సంవత్సరం దేశంలోని నలుమూలల నుండి వేలాది మంది భక్తులు శ్రీఖండ మహాదేవ్ను దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ యాత్ర చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందే.
జులై 14 నుంచి యాత్ర ప్రారంభం..
ఈ యాత్ర శ్రీఖండ్ మహాదేవ్ ట్రస్ట్ తరపున జూలై 14 నుండి ప్రారంభం కానుంది. జూలై 27 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఇక, ఈ ఏడాది శ్రీఖండ్ మహాదేవ్ ప్రయాణం ఇతర సంవత్సరాల కంటే చాలా ప్రమాదకరమైనదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు వెళ్లే మార్గంలో మంచు ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. యాత్రికుల సౌకర్యార్థం రెస్క్యూ, మెడికల్ మరియు అడ్మినిస్ట్రేషన్ బృందాలు యాత్ర సమయంలో బేస్ క్యాంపులో అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

నమోదు ప్రక్రియ...
శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర కోసం నమోదు చేసుకోవడానికి, భక్తులు అధికారిక వెబ్సైట్ https://shrikhandyatra.hp.gov.in ను ముందుగా నమోదు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు మరియు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు శ్రీఖండ్ మహాదేవ్ను దర్శించుకోరాదు. ఈ యాత్రలో పాల్గొనలానుకునేవారు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కో ప్రయాణికుడికి ₹250 ఉంటుంది. బేస్క్యాంప్ సింహ్ఘర్లో వైద్య తనిఖీ సమయంలో ప్రయాణం చేయలేకపోతే లేదా అస్వస్థతకు గురైనట్లయితే, రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి చెల్లించబడదు.
శిలా రూపంలో కొలువై..
సాధారణంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారు గాడిద, గుర్రం లేదా పల్లకి సహాయం తీసుకుంటారు. కానీ శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను కేవలం కాలినడకన మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. అమర్నాథ్ యాత్ర 13 వేల అడుగులు అయితే శ్రీఖండ్ మహాదేవ్ అధిరోహణ 18 వేల అడుగుల కంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడకు చేరుకునేందుకు యాత్రికులు కాలినడకన 35 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. శ్రీఖండ మహాదేవ్ పంచ కైలాసాల్లో ఒకటిగా పరిగణించబడతారు. ఈ ప్రదేశంలో శివుడు ఇప్పటికీ శిలారూపంలో ఉన్నాడని ప్రజల నమ్మకం.
చేరుకోవడం ఎలా..?
శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలోని రాంపూర్ నుండి కులులోని నిర్మాండ్ మీదుగా బాగిపుల్ జాన్లకు కారు లేదా బస్సులో వెళ్లొచ్చు. అక్కడినుండి సుమారు 35 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications












