హైదరాబాద్లో సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ సీజన్లో నగరానికి సమీపంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లాలనుకునేవారికి టీజిఎస్ఆర్టిసి ఓ శుభవార్తను అందించింది. పట్టణంలోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రాజెక్ట్ వద్దకు ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకరానుంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టిసి అధికారులు పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ వివరాలేంటో చూసేద్దాం..
పర్యాటకుల తాకిడి..
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు ఏపీలోని శ్రీశైలం డ్యాంకు వర్షపు నీరు అధికంగా వచ్చేస్తోంది. దీంతో అధికారులు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున సాగర్ డ్యాంకు వరద నీరు భారీగా వచ్చింది. ఈ క్రమంలో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండుకుండలా కనిపిస్తోంది. ఇంకా వరద నీటితో ఫ్లో కొనసాగడంతో అధికారులు సాగర్ గేట్లను కూడా ఎత్తివేశారు. మెుత్తం 20 గేట్లు ఉంటే, 5 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక, ఈ సాగర్ గేట్లను రెండేళ్ల తర్వాత ఎత్తటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.

నిన్నటి (సోమవారం) నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఒక్క హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలను నుంచి సమీపంలోని రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే, ఏపీలోని శ్రీశైలంతో పోలిస్తే సాగర్ భాగ్యనగరానికి సమీపంలో ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ జల సవ్వడుల అందాలను చూసేందుకు తరలివస్తోన్న పర్యాటకులకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటలోకి తీసుకొచ్చారు.
నల్గొండ డిపో ఆధ్వర్యంలో..
ఈ స్పెషల్ బస్సులు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి నేరుగా నాగార్జున సాగర్కు నడుస్తాయి. ఈ మేరకు రీజియన్ మేనేజర్ శ్రీలత ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ స్పెషల్ బస్సు సర్వీసులు నల్గొండ డిపో ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. స్పెషల్ డీలక్స్ బస్సులు ఎంజీబీఎస్లో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు, 6.45 గంటలకు, 7. 15, 7.30, 8, 9.45, 10.45 గంటలు ఉంటాయి. అంతేకాదు, ఈ బస్సులు మధ్యాహ్నం 2.30 గంటలకు సాయంత్రం 5 గంటలకు, 5.40 గంటలకు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు.

ఈ స్పెషల్ డీలక్స్ బస్లు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం నేరుగా సాగర్ నడపనున్నట్లు ఆర్టిసీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. నాగార్జున సాగర్ అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులు టీజీఆర్టీసీ అందిస్తోన్న ఈ సేవలను తప్పకుండా వినియోగించుకోవాలని ఆర్టిసి అధికారులు కోరుతున్నారు. ఆర్టిసీలో సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం చేస్తూ సాగర్ అందాలను తిలకించాలని అధికారులు కోరారు. ఇతర ప్రయివేట్ వాహనాల్లో వెళ్లి అత్యధిక డబ్బులు చెల్లించి సమయంతో పాటు డబ్బును వృథా చేసుకోవటం కంటే ఆర్టీసీ బస్సుల్లో తక్కువ టికెట్ ధరకు ప్రయాణాలు సాగించాలని అధికారులు సూచించారు. మరెందుకాలస్యం మీరు కూడా సాగర్ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి..



Click it and Unblock the Notifications













