దసరా పండగ వచ్చేస్తోంది. ఏటా ఈ సీజన్ వచ్చింటే భాగ్యనగరం హైదరాబాద్, బెంగళూరు నుంచి ఏపీలోని సొంతూళ్లకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమవుతుంటారు. ఈ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపడం మామూలే. అయితే, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతోపాటు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఈ సీజన్ అనువుగా ఉంటుదని భావిస్తున్న అధికారులు వినూత్న ఆలోచనకు తెరలేపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని, అదనపు సర్వీసులను నడపడంతోపాటు డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల ప్రయాణికులకు 10 శాతం రాయితీ అందిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
ఆదాయాన్ని పెంచేలా చర్యలు..
ఏపీఎస్ఆర్టీసీ పండగ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. దీనివల్ల పండగ సీజన్లో ప్రయివేటు ట్రావెల్స్ నుంచి వస్తోన్న పోటీని తట్టుకోవడంతోపాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించవచ్చని అధికారుల ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే, ఈ రాయితీ కారణంగా ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల తాకిడి అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నందున.. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

టిక్కెట్ రాయితీ తేదీలు ఇవే..
పండగ సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీని కల్పించారు. అయితే, ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్)లను మినహా మిగిలిన రోజుల్లో ఈ రాయితీ ఉంటుంది. అలాగే, విజయవాడ నుంచి హైదరాబాద్కు డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఎంజీబీఎస్కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770, మిగిలిన రోజుల్లో రూ. 700, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 830 ఉండగా మిగిలిన రోజుల్లో మాత్రం రూ. 750గా ఉంటుందని అధికారులు తెలిపారు.
రాయితీ ఛార్జీలు ఇలా..
దీంతోపాటు శుక్రవారం మినహా.. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు మిగిలిన రోజుల్లో రాయితీ టిక్కెట్ ఛార్జీకి అనుమతిని ఇస్తారు. అలాగే, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ. 2170, మిగిలిన రోజుల్లో రూ. 1970, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210, మిగిలిన రోజుల్లో రూ. 2010 వసూళు చేస్తారు. అమరావతి మల్టీ యాక్సిల్ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ.
1870, మిగిలిన రోజుల్లో 1700, ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 1930, మిగిలిన రోజుల్లో రూ. 1750 రాయితీ ఛార్జీలను అందించనున్నట్లు ప్రకటించారు. కేవలం అధికారికంగా తెలిపిన తేదీల్లోనే ఈ రాయితీ ఉంటుందని మర్చిపోవద్దు. పండగ సమయంలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించిన ఈ రాయితీని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.



Click it and Unblock the Notifications













