నాగోబా జాతర.. ఈ మాట విన్నవారికెవ్వరికైనా ఆదివాసీ జీవన విధానం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అలాంటి ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నేటి నుంచి (ఫిబ్రవరి 09) నుంచి ప్రారంభం కానుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆ ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం. ఆదివాసీల పండగకు ప్రతిరూపమైన నాగోబా జాతర విశేషాలు మీకోసం..
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెస్రం వంశీయుల చేతుల మీదుగా జరిగే ఈ ఉత్సవంలో కేస్లాపూర్లో ఉండే దాదాపు 400 మంది గిరిజనులతోపాటు అనేక ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబాను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేస్లాపూర్ వచ్చి పూజలు నిర్వహించారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈసారి జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డీఏస్పీల ఆధ్వర్యంలో, ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు, 37 మంది ఏఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లు 94, 243 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబాను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
గోదావరి జలాలతో అభిషేకం..
ఈ రోజు (శుక్రవారం) అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర ప్రారంభమై, మూడు రోజుల తర్వాత అంటే 12న దర్బార్తో ముగుస్తుంది. ప్రధానంగా మెస్రం వంశీయులు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్తిన మడుగుకు వెళ్లి తెచ్చిన అక్కడ గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేస్తారు. అయితే, జాతరకు మూడు రోజుల ముందే ఈ జలాలను తీసుకువస్తారు.

నాగోబా జాతర క్రతువులు పరిశీలిస్తే.. ఆదివాసీ జీవన విధానాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరడంతో జాతర ప్రారంభమవుతుంది. అంతేకాదు, నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజల కోసం సిరికొండ మండలంలో తయారు చేయించిన మట్టికుండలను వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రత్యేకరీతిలో పూజలు
నాగోబా జాతరలో గిరిజనులు ప్రత్యేక రీతిలో పూజలు నిర్వహిస్తారు. మట్టితో పుట్టను తయారు చేసి మెస్రం చేస్తారు. మహాపూజ అనంతరం రాత్రి ఒంటిగంట తర్వాత కొత్త కోడళ్ల పరిచయం ఉంటుంది. అంటే, ఇప్పటి వరకు నాగోబా ఆలయానికి రాని మెస్రం వంశ కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి సతీ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో వారంతా పూర్తిగా మెస్రం వంశంలోకి ప్రవేశించినట్లుగా భావిస్తారు. మరుసటి రోజు పెర్సపేస్, బాన్పేస్, మండగాజిలిపూజ, బేతల్ పూజ నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications













