ప్రతి సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ జరిగే తొమ్మిది రోజుల వేడుకల్లో లక్షలాదిగా వచ్చే భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది. ఈ సంవత్సరం అక్టోబరు 03 నుంచి 12 వరకూ దసరా వేడుకలు నిర్వహించనున్నారు. గతేడాది ఉత్సవాలకు సుమారు 13 లక్షల మందిపైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 15 లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు అవసరమైన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేస్తోన్న ఏర్పాట్లను ఒక్కసారి పరిశీలిద్దాం!
ఘాట్రోడ్డులో భక్తుల రాకపోకలు
ఏటా ఈ సీజన్లో ఇంద్రకీలాద్రిపై కనిపించే ప్రధాన సమస్య కొండరాళ్లు జారిపడటం. ఇటీవల భారీ వర్షాలకు ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ కారణంగా ఇప్పటికీ భక్తుల రాకపోకలు ఘాట్రోడ్డులో నియంత్రించారు. అయితే, ఈ మార్గాన్ని దసరా ఉత్సవాల సమయానికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాక్ మిటిగేషన్ పనులకు పూనుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ఫాల్ మిటిగేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఓ నిపుణుల బృందం ఇక్కడికి వచ్చని, పరిస్థతిని అధ్యయనం చేయనున్నారు. వారి సూచనల మేరకు కొండరాళ్ల సమస్యను అధిగమించేలా ప్రణాళికలు వేస్తున్నారు.

క్యూలైన్ల రూట్ మ్యాప్..
ఇక కొండ దిగువన ఉన్న వినాయక ఆలయం వద్ద నుంచి మూడు క్యూలైన్లు ఉంటాయి. అలాగే, కుమ్మరిపాలెం నుంచి వచ్చే ఒక లైను ఘాట్రోడ్డులోని ఓం మలుపు వద్ద ఐదు లైన్లుగా విడిపోతుంది. దీని ద్వారా భక్తులు దర్శనంకు వెళతారు. అనంతరం తిరిగి శివాలయం మెట్ల మార్గం గుండా కిందకు దిగి, అక్కడే అన్నప్రసాదం స్వీకరించేలా ప్రణాళిక వేస్తున్నారు. ఇప్పటికే దసరా ఉత్సవాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో దేవాదాయ, పోలీసు, మున్సిపల్ సహా అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. భక్తులకు నీళ్లు, క్యూలైన్లు, ప్రసాదాలు సహా అన్ని సౌకర్యాలూ కల్పించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.

ఎండ వేడిమిని తట్టుకునేలా..
ప్రధానంగా ఉత్సవాల సమయంలో క్యూలైన్లలో ఉండే భక్తులు ఎండ, వానల కారణంగా ఇబ్బందులు పడుతుండటం పరిపాటిగా మారింది. ఆ సమస్యను అధిగమించేందుకు క్యూలైన్ల పైకప్పును పూర్తి వాటర్ప్రూఫ్తో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఎండ వేడిమిని తట్టుకునేలా నడిచే మార్గంలో మ్యాట్లను వేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి, గతంలో ఎండలకు నేల వేడెక్కి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
ఈ మ్యాట్లను క్యూలైన్ల అంతటా వేయడం ద్వారా ఆ సమస్య పునరావృతం కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో భక్తులు జల్లు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సీతమ్మవారి పాదాలు, భవానీఘాట్, పున్నమిఘాట్లో 700 వరకూ షవర్లను అందించనున్నారు. దీంతోపాటు సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల, భక్తులు వేచి ఉండే శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.



Click it and Unblock the Notifications













