భాష ఏదయినా, భావాన్ని పలికే గొప్ప ఆయుధం పుస్తకం. అలాంటి భావాలను పుస్తకాల రూపంలో వెతికే పుస్తక ప్రేమికులకు మనదేశంలో కొదవే లేదు. వారి అన్వేషణకు ప్రధాన కేంద్రాలుగా మారుతాయి బుక్ ఫెస్టివల్స్. దేశ నలుమూలల్లో ఉన్న పుస్తక ప్రియులను ఒకే చోటకు రప్పించి మెప్పించేందుకు ఏర్పాటు చేయబడుతోంది న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్. గ్రాండ్గా నిర్వహించబోతున్న ఈ పుస్తక మహోత్సవ విశేషాలను తెలుసుకుందాం రండి.
పుస్తక ప్రియులకు నేషనల్ బుక్ ట్రస్ట్ ఒక శుభవార్తను అందించింది. ఢిల్లీలో ప్రతి ఏటా నిర్వహించే వరల్డ్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాల గురించి ఇప్పడు తెలుసుకుందాం. ఈ ఏడాది న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ థీమ్ ఎంటీ, బుక్ ఫెస్టివల్ టిక్కెట్ ఎంత వాటి గురించి ఇప్పడు చూద్దాం.
పుస్తక ప్రియుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో మహాకుంభ్ నిర్వహించనున్నారు. వాస్తవానికి, ప్రతి సంవత్సరం 'న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్' ఢిల్లీలో నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఇక, ఈ సంవత్సరం కూడా ఇది ఫిబ్రవరి 10 నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి పదిన ప్రారంభమయ్యే ఈ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది. అంటే మొత్తం 9 రోజుల పాటు ఈ వరల్డ్ బుక్ ఫెయిర్ ఉండనుంది. ఈ బుక్ ఫెస్టివల్లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ప్రచురణకర్తలు, పాఠకులు, రచయితలు పాల్గొంటారు. ఈసారి ఈ వరల్డ్ బుక్ ఫెయిర్లో మొత్తం 22 భారతీయ భాషలు, అనేక విదేశీ భాషల పుస్తకాలను ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సంవత్సరం థీమ్, వేదిక, ప్రవేశం మరియు టిక్కెట్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం.

వరల్డ్ బుక్ ఫెయిర్ 2024 థీమ్..
ఈ సంవత్సరం 'బహుభాషా భారతదేశం, జీవన సంప్రదాయం' ఆధారంగా ఈ వరల్డ్ బుక్ ఫెయిర్ జరగనుంది. ఈ బుక్ ఫెస్టివల్కు సౌదీ అరేబియాను అతిథి దేశంగా ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, టర్కీ, స్పెయిన్, శ్రీలంక దేశాలు కూడా ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. ఇంకా ఈ దేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ బుక్ ఫెయిర్ 2024, 51వ పుస్తక ప్రదర్శనను జరుపుకోబోతుంది. ఈ ఫెస్టివల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ హాల్ నెం. 1 నుండి 5 వరకు నిర్వహించనున్నారు.

ప్రవేశ రుసుము..
నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ వరల్డ్ బుక్ ఫెయిర్లో ప్రవేశించే పాఠశాల విద్యార్థులు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు పుస్తక ప్రదర్శనలో ప్రవేశం ఉచితంగా నిర్ణయించారు. ఇతరులకు ప్రవేశ రుసుము పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ ఫెస్టివల్ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.
ఎలా చేరుకోవాలి...
ప్రగతి మైదాన్లో నిర్వహించబడుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనకు చేరుకోవడానికి సమీప మెట్రో స్టేషన్ సుప్రీంకోర్టు. వరల్డ్ బుక్ ఫెయిర్ కోసం టిక్కెట్లను నేరుగా పొందొచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా టిక్కెట్లను పొందొచ్చు. అందుకోసం ఈ వెబ్సైట్ https://www.nbtindia.gov.in/ndwbf2024/ సంప్రదించగలరు. నేరుగా టిక్కెట్లు పొందాలనుకునేవారు ఢిల్లీ మెట్రో స్టేషన్ నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.



Click it and Unblock the Notifications












