నడి సముద్రంలో నిలిచిన చారిత్రక కోట.. సింధు దుర్గ్!
మాల్వాన్ ప్రకృతి అందాలకే కాదు చారిత్రక కట్టడాలు.. సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేసే ప్రతి అడుగూ సందర్శకులను మంత్రముగ్థులను చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. అరేబియా సముద్ర నడిబొడ్డున ఉన్న సింధుదుర్గ్ కోట మహారాష్ట్ర పర్యటకానికే మచ్చుతునగా నిలుస్తుంది. ఈ కోట మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా, మాల్వాన్ తాలూకా, తర్కక్లిలో నిత్యం సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. నడిసంద్రంలో ఉన్న ఈ కోట ఛత్రపతి శివాజీ ఇందుల్కర్ పర్యవేక్షణలో నిర్మించారు. సముద్రపు అలల తాకిడికి కోటగోడలు దెబ్బతినకుండా ప్రత్యేకమైన నిర్మాణ శైలి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
సింధుదుర్గ్ కోట మొత్తంగా ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. మాల్వాన్ నుంచి కోటను చేరుకునేందుకు యాభై నుంచి డెభ్బై రూపాయిలు చెల్లించి జెట్టీలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకేసారి ఇరవై మంది వరకూ వెళ్లేలా ఇక్కడ జెట్టీలు అందుబాటులో ఉంటాయి. ఈ రాజ కోటలో హనుమాన్, జరిమారి, భవానీ దేవాలయాలు పర్యాటకులకు ప్రధానమైన ఆర్షణగా చెప్పొచ్చు. సింధుదుర్గ్ మహారాష్ట్ర అత్యంత ముఖ్యమైన సముద్రతీరపు కోటలలో ఒకటి. ఇక్కడి సముద్రపు అలలు చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ దగ్గరకు వెళితే మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది.
ఈ కోట 42 బురుజులతో ఓ విచిత్రమైన కోట గోడతో నిర్మించారు. ఈ కోట నిర్మాణానికి 73 వేల కిలోల ఇనుము వాడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కోట నిర్మాణ శైలి అలనాటి రాచరికపు ఆనవాళ్లకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎగసిపడే అలలు కోట గోడలను తాకుంటే వచ్చే శబ్ధం ఎంతో వినసొంపుగా ఉంటుంది. వంపులు తిరిగే ఇక్కడి రాతి నిర్మాణాలు నిత్యం సెల్ఫీలకు పనిచెబుతాయి. సముద్రపు పిల్లగాలులు కేరింతలు కొట్టే పర్యాటకులను మరో ప్రపంచపు అంచుకు తీసుకువెళ్లే అనుభూతిని కలిగిస్తాయి.
ఆకట్టుకునే స్కూబా డైవింగ్..
ఈ అద్భుతమైన సింధుదుర్గ్ సముద్రంలో స్కూబా డైవింగ్ మరో ప్రత్యేకత. ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆహ్లాదపరచేందుకు కొన్ని సాహస క్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి స్కూబా డైవింగ్తో చారిత్రక ప్రదేశపు అడుగుభాగాన సరికొత్త ఆన్వేషణకు ప్రయాణం చేసే అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్కూబా డైవింగ్ నిపుణులు నిత్యం ఇక్కడి సాహస క్రీడలను పర్యవేక్షిస్తూ ఉంటారు.
దీంతోపాటు చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఆడవచ్చు. అందుకే ఈ పర్యటనకు వచ్చే సందర్శకులు సింధుదుర్గ్ సముద్రంలోపల సముద్రపు లోతు కాదు, ఆకాశపు అంచులు చూసి రావచ్చు అనేలా ఫీలవుతుంటారు. కోటలో రెక్కలు కట్టుకున్నట్లు గాలిలో విహరించవచ్చు. తీరప్రాంతంలో వాలీబాల్ ఆడుకుంటూ సమయమే తెలియకుండా గడిపేందుకు ఈ కోట ఆనువైన ప్రదేశం.
సింధుదుర్గ్ విహారయాత్రకు వెళ్లే పర్యాటకులకు కోట నిర్మాణం అద్భుతం అనిపించేలా చేస్తుంది. వారాంతాల్లో కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తూ నగరవాసులు ఆహ్లాదంగా గడుపుతూ ఉంటారు. దూర ప్రాంతం నుంచి చూస్తే ఓ అద్భుత దీవిలో దాగిన చారిత్రక నిర్మాణపు అందాలు దర్శనమిస్తాయి. ముంబాయికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో మాల్వాన్ ఉంది. ఇక్కడికి రోడ్డు, రైలు మార్గాల ద్వారానే కాకుండా విమాన మార్గంలో కూడా వెళ్లవచ్చు. గోవా విమానాశ్రయం నుండి సింధుదుర్గ్ చేరుకోవడానికి దగ్గరి మార్గం.