రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా ఆనాటి చరిత్రక ఆనవాళ్లు మాత్రం నేటికీ తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తునే ఉంటాయి. అలాంటి రాష్ట్రంలోని మెదక్ జిల్లా నేటికీ పురాతన కట్టడాలు.. కోట గోడలు.. బురుజులు అలనాటి రాచరిక పాలనకు దర్పణంగా.. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా పలకరిస్తుంది. మెదక్ పట్టణానికి చేరువలో ఉన్న మెతుకు దుర్గం కోట చరిత్రకు ఓ మణిహారంగా.. ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా విరాజిల్లుతోంది.
ప్రాచీన భారతదేశంలోని కాకతీయుల కాలంలో కొండపై నిర్మించిన దుర్గమే ఈ నిర్మాణం. ఈ కోట సుమారు 12వ శతాబ్ద కాలం నాటిదిగా చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రుదుర్భేద్యంగా మార్చిందని చెప్పొచ్చు. ఎత్తయిన కొండ, చుట్టూ నలభై కిలోమీటర్ల వరకూ ఎలాంటి కదలికలున్నా పసిగట్టేందుకు బురుజులు, కోటకు ఎక్కడానికి వీల్లేనంత పెద్ద పెద్ద గోడలు, మలుపులు తిరిగే కొండదారితో ఎంతో వ్యూహాత్మక నిర్మాణంగా పేరు గాంచింది.
ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రచారంలో ఉంది. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడట. కాకతీయుల తర్వాత ఇది కుతుబ్ షాహీల ఆధీనంలోకి వచ్చింది. ఈ కోటలో 17 వ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మసీదు నిర్మించారు. ఇక్కడ ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు నేటికీ కనిపిస్తాయి. మూడు ముఖద్వారాలు ద్వారా లోపలకి చేరుకోవచ్చు. ఉన్నాయి. వాటిలో ప్రధాన ద్వారం, సింహద్వారం, గజ ద్వారం ఉంటాయి. కోట ప్రధాన మార్గం కాకతీయుల చిహ్నమైన రెండుతలల గంఢబేరుండంతో గంభీరంగా దర్శనమిస్తుంది.

చల్లదనంతోపాటు ప్రశాంతత..
అంతేకాదు, కోటలో స్థిరమైన పైకప్పుకు ఊతం అందించేందుకు ఉపయోగించిన కలపను నేటికీ ఇక్కడ చూడవచ్చు. కాకతీయ పాలకులతోపాటు వారి తర్వాత పాలించిన కుతుబ్ షాహిలకు ఈ కోట ఒక నియంత్రణా కేంద్రంగా ఉండేది. కుతుబ్ షాహి పాలకులు 17వ శతాబ్ద౦లో కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును నిర్మించారు. ఈ కోట చారిత్ర పరంగానే కాదు, పురావస్తు పరంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ కోటలో 3.2 మీటర్ల పొడవైన 17వ శతాబ్దానికి చెందిన ఒక ఫిరంగిని కూడా సందర్శకులు చూడొచ్చు. ఈ కోట పైభాగం నుండి పర్యాటకులు చుట్టుపక్కలి సుందర దృశ్యాలతో పాటుగా పూర్తి పట్టణాన్ని చూడొచ్చు. సాయంత్రపు సమయంలో ఇక్కడ వీచే గాలి... చల్లదనంతోపాటు మానసిక ప్రశాంతతను కూడా చేరువ చేస్తుంది.

ఇలా చేరుకోవచ్చు..
మెదక్ కోట హైదరాబాదు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, మెదక్ నగరానికి ఉత్తరంవైపు ఉన్న సుమారు 300 అడుగుల ఎత్తు ఉండే ఓ కొండపై 400 ఎకరాల విస్తీర్ణంలో మెదక్ కోట నిర్మించారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేషనల్ హైవే 44 కి దగ్గరగా చేగుంట నుంచి మలుపు తీసుకొని ప్రయాణం చేయాలి. అలాగే, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వైపుగా వస్తే - రామాయంపేట నుంచి 25 కిలోమీటర్లు జర్నీ ఉంటుంది.

ముంబై మార్గం నుంచి వస్తే సంగారెడ్డి వద్ద నాందేడ్, అకోలా హైవే మీదుగా వచ్చి, జోగిపేట వద్ద మలుపు తీసుకొని 35 కిలోమీటర్లు, హైదరాబాద్ లోని బాలానగర్ నుండి వస్తే 80 కిలోమీటర్లు నర్సాపూర్, గుమ్మడిదల, కౌడిపల్లి, పోతాన్ చెట్టిపల్లి, రాంపూర్, మంబోజిపల్లి మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













