వర్షాకాలం అంటేనే కుటుంబసమేతంగా విహారానికి ప్లాన్ చేసుకునే సీజన్. అలాంటి ప్రణాళికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ టూరిజం సరికొత్త ఆలోచనకు తెరలేపింది. ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, బోటింగ్ వంటి కార్యకలాలతో ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ఔత్సాహికులను ఆకర్షించేలా ప్లాన్ చేసింది. ప్రకృతి పర్యాటకం పేరుతో ఓ సరికొత్త ప్రాజెక్టును పరిచయం చేయబోతోంది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించేలా రూపొందిసతోన్న ఆ ప్రకృతి పర్యాటకం ప్రాజెక్ట్ విశేషాలను తెలుసుకుందాం!
తమిళనాడు, కేరళ, కర్ణాటక అంటూ పచ్చని ప్రకృతితో గడిపేందుకు ఇతర రాష్ట్రాలకు పరుగులు పెడుతుంటారు చాలామంది. అక్కడి ఎత్తయిన కొండకోనలు, జలపాతపు సవ్వడులు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతారు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. అలాంటి వాతావరణం తెలంగాణలోనూ ఉందని గ్రహించిన పర్యాటక శాఖ ఆ ప్రకృతి వనరులను మరింత అభివృద్ధి చేసి పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేలా చేస్తోంది.
ప్రకృతి పర్యాటకం పేరుతో ఈ ప్రాజెక్టులో ప్రాథమికంగా 12 పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. ఇందుకోసం మూడు, నాలుగు ప్రాంతాలను ఒక సర్క్యూట్ కింద తీసుకొన్ని, ఇందులో రక్షిత అటవీ ప్రాంతాల్లో ఏడు, అటవీ ప్రాంతాల వెలుపల ఐదు సర్క్యూట్లను గుర్తించారు. వీటిలో అమ్రాబాద్, కవ్వాల్ వంటి పెద్దపులులు తిరిగే అభయారణ్యాలు, కుంటాల, పొచ్చెర, బొగత లాంటి జలపాతాలు కూడా ఉన్నాయి. రామప్ప, అనంతపద్మనాభస్వామి, బాసర తదితర ఆలయాలతో పాటు కోటిపల్లి రిజర్వాయర్, శామీర్పేట చెరువు, ప్రాణహిత నది, కిన్నెరసాని డ్యాం వంటి జలవనరులను ప్రకృతి పర్యాటకంలో భాగం కానున్నాయి.

ప్రకృతి పర్యాటకంలోని సర్క్యూట్స్..
అమ్రాబాద్లోని సోమశిల, మన్ననూరులలో సందర్శకులు విడిది చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అమ్రాబాద్ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్ వాటర్లో బోటింగ్, శ్రీశైలం ఆలయ సందర్శన కోసం ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, కవ్వాల్ టైగర్ రిజర్వులో సఫారీ, మంచిర్యాలలో గాంధారీ ఫోర్ట్ సందర్శన, శివ్వారం వైల్డ్లైఫ్ శాంక్షరీ సందర్శన, జన్నారంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వికారాబాలోని అనంతగిరిలో విడిది చేసేందుకు గెస్ట్హౌస్, అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన, అనంతగిరి అడవిలో సఫారీ, కోటపల్లి రిజర్వాయర్లో బోటింగ్, కయాకింగ్కు ఏర్పాట్లు ముమ్మరం చేయనున్నారు. ఖమ్మంలోని కనకగిరి అటవీప్రాంతంలో సఫారీ, బర్డ్వాచ్, ట్రెక్కింగ్, బోటింగ్, కనకగిరిలో బస కల్పించనున్నారు. ఆదిలాబాద్లోని మావల పార్క్లో బోటింగ్, బర్డ్వాక్, సఫారీ, వసతి, కుంటాల పొచ్చెల వాటర్ ఫాల్స్, బోథ్ అర్బన్ పార్క్ సందర్శన, సాత్నాల చెరువులో బోటింగ్, ట్రెక్కింగ్కు ఏర్పాట్లు చేయనున్నారు.
కొత్త అనుభూతులను పంచే పర్యాటకం
వీటితోపాటు కొత్తగూడెంలోని కిన్నెరసాని ప్రాంతంలో విడిది కేంద్రం, డ్యాంలో బోటింగ్, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగ్, రంగాపురం క్యాంప్ సందర్శన, జంగాలపల్లి అటవీప్రాంత సందర్శనకు చర్యలు తీసుకోనున్నారు. ఏటూరునాగారంలోని తాడ్వాయి హట్స్, పాకాల, లక్నవరంలో వసతి, భొగత వాటర్ఫాల్స్, రామప్ప ఆలయం సందర్శన, ఏటూరునాగారం అభయారణ్యంలో టెక్క్రింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచ్, పాకాల అభయారణ్యంలో క్యాంపింగ్ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్లోని ఉమ్మెడ బ్యాక్ వాటర్ ప్రాంతంలో బస. బ్యాక్ వాటర్లో బోటింగ్, కృష్ణ జింకల సఫారీ, గాదెపల్లిలో రాత్రి బస, బాసర ఆలయ సందర్శనకు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లూ పూర్తి చేశారు. నల్గొండలోని గాజుబిడెం బ్యాక్ వాటర్లో విడిది, బోటింగ్, నెల్లికల్ ఎకోపార్క్లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్ ఉండనున్నాయి. మేడ్చల్ శామీర్పేట్ చెరువులో బోటింగ్, బర్డ్ వాచ్, రిసార్టుల్లో విడిదికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డిలోని మంజీర డ్యాం వద్ద విడిదితోపాటు డ్యాంలో బోటింగ్, బర్డ్ వాచింగ్ ఉంటాయి. అలాగే, ఆసిఫాబాద్-కాగజ్నగర్ ప్రాంతంలో వేంపల్లిలో బస ఉండనుంది. ప్రాణహితలో బోటింగ్, గుండెపల్లిలో ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్వాచింగ్. రాబందుల పాలరాపుగుట్ట సందర్శనకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం.. తెలంగాణ పర్యాటకం గొప్ప అనుభూతులను పంచుతుందనడంలో సందేహమే లేదు.



Click it and Unblock the Notifications













