బెంగుళూరుకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్..
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరంలో టెక్నాలజీని మించిన విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక, కళాత్మక, సహజ అందాలతో కూడిన ఎన్నో ప్రదేశాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వినోదాన్ని అందిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక్కడి రాచరికపు పాలనకు నిదర్శనమైన భవనాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు, రుచికరమైన ఆహారాలు ఇక్కడి ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం బెంగుళూరులో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో బెంగుళూరు సందర్శించాలని ప్లాన్ చేస్తున్నవారు తప్పకుండా వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందే..

నీటి మునిగిన ప్రాంతాలు..
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తాయి. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్ఫీల్డ్, బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరద తాకిడికి గురయ్యాయి. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. నీరు నిలిచిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్లోని ప్రధాన కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని కోరాయి.
రోడ్లు జలమయం కావడంతో సాప్ట్ వేర్ ఉద్యోగులు కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. బోట్లలో ప్రజల్ని సహాయక కేంద్రాలకు తరలిస్తున్నారు. వార్తర్ రోడ్డుతోపాటు బెల్లాందుర్, సార్జాపుర రోడ్డు, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎమ్ఎల్ లేఔట్ వంటి ఏరియాలు పూర్తిగా నీట మునిగాయి. నగర శివారులోని ఇలాంటి ప్రాంతాల్లోని వర్షపు నీరు వరద ప్రవాహాన్ని తలపిస్తోంది. చాలా చోట్ల వీధులు పూర్తిగా నీటితో నిండిపోయాయి.

ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం..
వర్షాల కారణంగా నగరంలోని ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల వరకు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బీదర్, కళాబురాగి, విజయపుర, గాడగ్, ధార్వాడ్, హవేరి, దేవనగరె వంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. కాబట్టి బెంగుళూరు వెళ్లాలని ఆలోచించే ప్రయాణికులు వారి ప్రణాళికను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
రోగాల బారిన ప్రజలు..
నీటమునిగిన ప్రాంతాల నుండి ఉద్యోగస్థులను, విద్యార్థులను పడవలు, ట్రాక్టర్ల సహాయంతో టెక్కీలను, విద్యార్థులను వారి కార్యాలయాలు, పాఠశాలలకు తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. రెయిన్బో డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్స్ లేఅవుట్, సర్జాపూర్ రోడ్లోని కొన్ని ప్రాంతాలు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రయివేటు వాహనాల్లో వెళ్లేవారు సైతం గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. వర్తూరులోని బలగెరె-పాణత్తూరు రహదారి ఏకంగా ఓ నదిగా మారింది.
రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, పాఠశాలలు వంటి మౌళిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాలతో ప్రజలు తీవ్ర అనారోగ్య కారణాలకు గురవుతున్నారు. డెంగీ వంటి రోగాలకు బారిన పడుతున్నారు. నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో ప్లేట్లెట్ల కొరతను అధిగమించేందుకు పలు బ్లడ్ బ్యాంకులు రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈరెండు మూడురోజుల్లో బెంగుళూరుకు ప్రయాణించాలనకునేవారు వారి ప్రయాణాన్ని విరమించుకోవాల్సిందే.



Click it and Unblock the Notifications













