ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతాలు.. మహబూబ్నగర్ సొంతం..
మహబూబ్నగర్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. ఇది జిల్లా ముఖ్యపట్టణం.ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాను పాలమూర్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుండి బెంగళూరు హైవే మీదుగా జడ్చర్ల చేరుకొని అక్కడి నుండి కుడివైపునకు మరో 15 కిలోమీటర్లు వెళితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూరు వజ్రం, గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలోనే దొరికినట్లు చెబుతారు. ఈ జిల్లాలో ఎన్నో ఆలయాలు, మరెన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం పదండి.

గద్వాల కోట
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రాంతాల్లో గద్వాల కోట ఒకటి. జిల్లాలోని కోటలన్నిటిలోకి ఇది ఎంతో ప్రసిద్ధి చెందినది. గద్వాల పట్టణం నడి బొడ్డున ఈ ప్రాంతం ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించారు. లోపలి వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మితమైంది. బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ, లోపలి వైపు రాతి గోడ ఏ మాత్రం చెక్కు చెదరలేదు.
రాజోలి కోటలు, దేవాలయాలు..
మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మండల కేంద్రంలో వున్నా రాజోలి గ్రామం లో వెలసిన వైకుంట నారాయణ స్వామి దేవాలయం చాల పురాతనమైనది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం. ఈ గ్రామం కర్నూలు జిల్లాకు సమీపంలో ఉంది. అందమైన విగ్రహాలు ,అద్బుతమైన శిల్పకళా ఈ దేవాలయ కట్టడాల్లో కనిపిస్తుంది . తుంగభద్రా నది తీరాన సుంకేశుల డ్యామ్ కి సమీపంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. సోమన్నభూపాలుడు నిర్మించిన కోటనే రాజోలి కోటగా ప్రసిద్ది చెందింది.

పిల్లలమర్రి
పిల్లల మర్రి వృక్షం మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి సందర్శకులు తరలివస్తుంటారు. పాలమూరు పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి పర్యాటక కేంద్రం ఉంది. పిల్లలమర్రి చూసేందుకు పట్టణ ప్రజలేగాక చుట్టు పక్క పల్లెల నుండి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. పట్టణంతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు, విద్యార్థులు మ్యూజియంలోని విశేషాలతో పాటు మరుపురాని జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తారు. 700 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ మర్రి చెట్టు మొదలెక్కడో కొమ్మలెక్కడొ తెలియకుండా మూడెకరాలు మేర విస్తరించింది.
చేరుకోవడం ఎలా?
మహబూబ్నగర్ కి విమాన మార్గం లేదు. రైలు మార్గం ద్వారా అయితే, మహబూబ్ నగర్లో రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్లే దారిలో ఉంది. ఈ జిల్లాలోని గద్వాల్ ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉంది. రోడ్డు మార్గం ద్వారా అయితే, దేశంలోని అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారి పై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. ఇక్కడికి హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు, రాయ్చూరు, బళ్ళారి వంటి ఇతర ప్రదేశాల నుంచి బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications













