బెంగుళూరు టు హైదరాబాద్ వందేభారత్ ట్రైన్..!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఈ నెల 15 లోపు హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీయనుంది. ప్రస్తుతం కాచిగూడ-యశ్వంత్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు ఉండగా.. ఇదే మార్గంలో వందేభారత్ పరుగులు పెట్టనుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విలాసవంతమైన సౌకర్యాలు, సీసీ కెమెరాల నిఘానడుమ 8.30 గంటల్లో చేరుకోవచ్చు. ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఐటి దిగ్గజ నగరాలు..
ఇప్పటికే విశాఖ, తిరుపతి మధ్య సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రూట్లో ఉరుకులు పెట్టేందుకు వందేభారత్ రెడీ అవుతుంది. ఐటీ పరంగా దేశంలోనే దిగ్గజ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. అలాగే, కాచిగూడ-యశ్వంతపూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు మూడో వందేభారత్ సర్వీసుగా అందుబాటులోకి రానున్న ఈ రైలు సేవలు.. ఆగస్టు 15న ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎనిమిదిన్నర గంటల్లోనే..
ఈ వందేభారత్ రైలు ప్రారంభోత్సవాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. ఈ వందేభారత్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోవచ్చు. కాచిగూడలో ఉదయం ఆరుగంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర వరకు బెంగుళూరు చేరుకుని, తిరిగి అక్కడ మూడు గంటలకు బయలు దేరి రాత్రి పదకొండున్నరకు కాచిగూడ చేరుకునే అవకాశం ఉంది. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య గత జనవరిలో ప్రారంభమైంది.
ఈ స్టేషన్లలో ఆగుతుంది..
హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఈ సెమీ హై స్పీడ్ రైలు కర్ణాటకలోని ఏ రైల్వే స్టేషన్లోనూ ఆగదని సమాచారం. చాలా వరకు కాచిగూడ- యశ్వంత్పుర్ ఎక్స్ప్రెస్ ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్నగర్, షాద్నగర్లలో ఆగుతాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్- భువనేశ్వర్, సికింద్రాబాద్ - నాగ్పుర్, పుణె- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లు కూడా రైల్వే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ట్రైన్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య 16 కోచ్లతో నడవనున్నట్లు సమాచారం.

కాగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రాయచూర్ స్టేషన్లో ఆగాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రైల్వే శాఖ ఆమోదం పొందుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. షాద్నగర్లో రైలును ఆపడం వల్ల సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుందని, అక్కడ సులభంగా కనెక్టివిటీ ఉంటుందని సీనియర్ రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే, భద్రత దృష్ట్యా 160 కి.మీకి పరిమితం చేయబడింది. ఈ రైలులో ఒక్క ఇంజిన్ కూడా లేదు. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన ఈ రైలు సీట్లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా బయో టాయిలెట్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.



Click it and Unblock the Notifications













