ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీధి వీధినా.. వాడ వాడనా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చాలామంది దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు. అలాంటివారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం వాఘా సరిహద్దు. ఆగస్టు 15 రోజున సైనికులు చేసే ప్రత్యేక కవాతు జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మనకు అందిస్తుంది. ఆ దృష్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచీ సందర్శకులు ఇక్కడకు వాలిపోతారు. మరి ఇంతకీ ఈ సరిహద్దు ప్రత్యేకత ఏంటి? అక్కడ సైనికులు ఎలాంటి పరేడ్ నిర్వహిస్తారు? తెలుసుకుందాం రండి!
ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాఘా బోర్డర్లో ఘనంగా నిర్వహించనున్నారు. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న వాఘా సరిహద్దు ప్రత్యేక కవాతు దృష్ట్యా గుర్తింపు పొందిందనే చెప్పాలి. ఇక్కడ 1959 నుంచి, భారతదేశ సరిహద్దు భద్రతా దళం (BSF), పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ రేంజర్లు తమ తమ జాతీయ జెండాలను అవనతం చేసే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వేడుకను రెండు దేశాల నుంచి అనేక మంది ప్రేక్షకులు వీక్షిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏటా ఇక్కడ పంద్రాగస్టు సంబరాలను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున ఈ సరిహద్దుకు చేరుకుంటూ ఉంటారు.

ఇది భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమని చాలామందికి తెలియదు. అయితే, ఈ వాఘా బోర్డర్లో కేవలం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాత్రమే కాకుండా ప్రతి రోజూ సాయంత్రం సమయానికి భారత్- పాక్ సైనికులు బీటింగ్ రిట్రీట్ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కవాతును చూసేందుకు ఎక్కడెక్కడి నుండో సాధారణ ప్రజలు సైతం ఇక్కడికి చేరుకుంటారు. ప్రధానంగా సూర్యస్తమయం ముందు రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాలు పతాకాలను కిందకు దించి నిర్వహించే ప్రత్యేకమైన కవాతు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవంటే నమ్మండి.

దేశ భక్తిని దిక్కులు పిక్కటిల్లేలా..
అలా కవాగు మిగిసిన తర్వాత జెండాలను మడతపెడతారు. అంతేకాదు, ఈ కవాతులో రెండు దేశాల సైనికుల మధ్యా కరచాలం ఉండడం ఇక్కడ విశేషం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సరిహద్దు గేట్లను మూసివేస్తారు. ఇలా సూర్యుడు అస్తమించగానే సరిహద్దులోని ఇనుప గేట్లను తెరిచి రెండు జెండాలను ఒకేసారి అవనతం చేయడం మరెక్కడా చూసేందుకు అవకాశం ఉండదు. ఒక్క వాఘా సరిహద్దులోనే ఈ తరహా కార్యక్రమం ఉంటుంది. ఈ బీటింగ్ రీట్రీట్కు ప్రధానం కారణం రెండు దేశాల మధ్య సోదరభావానికి, సహకారాని సింబాలిక్గా చెప్పబడుతుంది. అలాగే, ఈ విన్యాసం సాగుతున్నప్పుడు భారత్ మాతాకీ జై, వందేమాతరం, హిందుస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలతో ప్రజలు తమ దేశ భక్తిని దిక్కులు పిక్కటిల్లేలా హోరెత్తిస్తారు. ఏటా వాఘా సరిహద్దులో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలు గొప్ప అద్భుతమైన విన్యాసాలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తాయనడంలో సందేహమే లేదు.

ఒక్క గేట్ మాత్రమే అడ్డుగోడ..
భారత్ - పాకిస్థాన్ మధ్య శాంతి, స్నేహ భావాన్ని పెంపొందించేలా ఇరు దేశాల మధ్యా వాఘా సరిహద్దులో ఆగస్టు 15వ తేదీన నిర్వహించే ఈ విన్యాసాలకు మధ్యలో ఒక్క గేట్ మాత్రమే అడ్డుగోడలా ఉంటుంది. ఈ రెండు దేశాల సైనికులు ఒకరికొకరు పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తే.. మనకు తెలియకుండానే మనలోని దేశ భక్తి పొంగుకొస్తుంది. ఎంతో ఉద్వేగభరితంగా సాగే ఈ కార్యక్రమంలో ఎక్కువగా సైనికుల కుటుంబాలు పాల్గొంటాయి. అలాంటి గొప్ప సందర్భాన్ని ఎవరు మిస్సవ్వాలని కోరుకుంటారు చెప్పండి. మరెందుకు ఆలస్యం.. వాఘా సరిహద్దు పరేడ్ను వీక్షించేందుకు మీరూ సిద్ధమవ్వండి!



Click it and Unblock the Notifications












