హైదరాబాద్లోని అతిపెద్ద మెడిటేషన్ హాల్ పేరేంటో తెలుసా...
ఉదయం నుంచి రాత్రి వరకూ బిజి బిజిగా గడుపుతూ చాలామంది వారి ఆరోగ్యంపై శ్రద్ద వహించడం లేదు. అయితే, కొంతమంది మానసిక ప్రశాంతత కోసం ఉదయాన్నేలేచి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుంటారు. పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మెడిటేషన్ చేయాలనుందా? సిటికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు సేదతీరాలనుకుంటున్నారా? అయితే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదండి. మనదేశంలోనే ప్రపంచంలోని అతిపెద్ద మెడిటేషన్ హాల్ ఉందనే విషయం తెలుసా.. అది కూడా హైదరాబాద్లోనే ఉందండి.. హైదరాబాద్లో ఉన్న ఈ అతిపెద్ద మెడిటేషన్ హాల్ పేరేంటో తెలుసా.. రండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అతిపెద్ద మెడిటేషన్ హాల్..
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న అతిపెద్ద మెడిటేషన్ హాల్ పేరు కన్హా శాంతివనం. ఈ శాంతివనం హైదరాబాద్ నగరం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎటువంటి శబ్ధకాలుష్యాలు కూడా ఇక్కడికి దరిచేరవు. శ్రీరామచంద్ర మిషన్ 1945లో ఉత్తర్ ప్రదేశ్లో అప్పటి గురూజీ బాబూజీ మహరాజ్ ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 5 వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ మెడిటేషన్ సెంటర్ మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ 40 వేల మందికి పైగా బసచేసేందుకు వీలుగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకేసారి లక్షమంది ప్రజలు కూర్చుని ధ్యానం చేసేందుకు వీలుగా ఈ కన్హ శాంతివనంలోని హాల్స్ను నిర్మించారు. ఇక్కడ ఒక సెంట్రల్ హాల్తోపాటు ఎనిమిది సెంట్రల్ హాల్స్ కూడా ఉండడం విశేషం..
దీనిని మాజీ రాష్ర్టపతి ప్రారంభించారు..
ఈ కన్హా శాంతివనాన్ని హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెడ్క్వార్టర్గా ప్రకటించింది. ఈ శాంతివనాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 2,2020న ప్రారంభించారు. రెండేళ్ల క్రితం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అతిపెద్ద మందిర నిర్మాణమైన ఈ కన్హా శాంతివనానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఒక పెద్ద ధ్యానం కేంద్రం నిర్మించడంతో పాటు దాని చుట్టూ తాబేలు ఆకారంలో ఎనిమిది ఉప కేంద్రాలను నిర్మించారు. ధ్యానం చేసే అభ్యాసీల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు మందిరం చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించేలా చేశారు. నలభైవేల మందికి పైగా బస చేసేందుకు వీలుగా వసతి సౌకర్యాలను అందించారు. అంతేకాకుండా ఈవసతి ఏర్పాటు కోసం దాదాపుగా 1400 ఎకరాలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ శాంతివనంలో లక్ష మందికి వంటచేసే వంట గదులనూ కూడా నిర్మించడం విశేషం.

బుద్ధుని విగ్రహం ఎంతో ప్రత్యేకత..
అంతేకాదండి, ఈ శాంతివనం చుట్టూ ఓ మానవ నిర్మిత అడవి ఉంది. ఈ అడవిలో లైబ్రరీలు, మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి. వీటితోపాటు ఈ శాంతివనంలో ఏడు లక్షల చెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పలు రకాల అరుదైన వృక్షజాతులను కూడా ఇక్కడ సంరక్షిస్తున్నారట. ఆ వృక్షజాతులు కూడా తమిళనాడు, కేరళ, అండమాన్ దీవులు, ఈశ్యాన్య రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. ఈ అడవిలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉన్నబుద్ధుని విగ్రహం.. ఈ విగ్రహం దగ్గర నిలబడి శబ్దం చేస్తే.. ఆ శబ్దం తిరిగి పదిసార్లు ధ్వనిస్తుంది. ఈ శాంతివనంలోకి వెళితే ఓ దట్టమైన అడవిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందని ఇతర పర్యాటకులు చెబుతున్నారు. ఇందులో చిన్నపిల్లలకోసం చిల్డ్రన్స్పార్క్, తినుబండారాల కోసం క్యాంటన్లు వంటివి కూడా ఉన్నాయి. సెలవుల్లో కుటుంబంతో సరాదాగా గడిపేందుకు ఈ శాంతివనం మంచి ఎంపిక అనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని పలు డిపోల నుంచి ఈ శాంతివనానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. లేదంటే ఆటోలు, క్యాబ్ల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













