ఐటీ కారిడార్లో అందమైన అటవీ పార్క్ ఎక్కడుందో తెలుసా?
హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త ఆహ్లాదభరితమైన ప్రదేశాలు రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా ఐటీ కారిడార్లో ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ పార్కు అందుబాటులోకి వచ్చింది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ పార్కు ఇప్పుడు ఐటీ కారిడార్లోని నివాసం ఉంటున్న వారికి పేవరేట్ హాట్ స్పాట్గా మారింది.
ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్య తీవ్రత... మరోవైపు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ పార్కులు ఎంతగానో సహాయపడతాయి. తాజాగా నగరానికి పడమర దిక్కున వేగంగా విస్తరిస్తున్న ఐటీ కారిడార్లో సుమారు 250కి పైగా ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.

ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో అటవీ ప్రాంతాలు నగర వాసులకు పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నగరం నడిబొడ్డున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్కు నగరవాసులు సేదదీరే విడిది కేంద్రంగా ఎంతో పేరు పొందింది. ఆ తరహాలోనే ఐటీ కారిడార్లోని కోకాపేట, పుప్పాల్గూడ, నానక్రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి ప్రాంతాలకు సమీపంలో ఉన్న మంచిరేవులలో సుమారు 250 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది.
దీన్ని పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో దాని మధ్యలోంచే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ వెళ్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు రావడంతో నగరంలోని కేబీఆర్ పార్కు తరహాలో దీనిని అభివృద్ధి చేసి, నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వందలాది మంచి సందర్శకులతో ఈ పార్క్ సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.
ఎన్నో హంగులతో రూపుదిద్దారు
నిజానికి ఈ ప్రాంతం గతంలో నిర్మానుష్యంగా, రాళ్ల గుట్టలతో నిండి ఉండేది. అవే రాళ్లను ఇప్పుడు సందర్శనీయ స్థావరాలుగా మార్చేశారు. ఎత్తయిన రాళ్ల గుట్టలతో కూడిన ఈ అటవీ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ రూట్ను నిర్మించారు. అలాగే, సైకిల్ ట్రాక్ను నాలుగు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. సైకిళ్లను నిలిపేందుకు షెడ్డును ఏర్పాటు చేశారు. మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి నగరవాసులు సైకిలింగ్ను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి ఇది సర్గధామంగా కనిపిస్తుంది. దీంతోపాటు వాకింగ్ ట్రాక్ను నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించారు. సందర్శకులు హాయిగా కూర్చుని మాట్లాడేందుకు వీలుగా చెట్ల కింద రచ్చబండను ఏర్పాటు చేశారు.

ఎత్తయిన వాచ్ టవర్
అటవీ ప్రాంతం మధ్యలో పెద్ద చెరువు ఉండటంతో దాన్ని సందర్శకులు పూర్తి స్థాయిలో ఆస్వాదించేలా చెరువు కట్టను, వ్యూ పాయింట్ను నిర్మిస్తున్నారు. చెరువులోకి నీరు వచ్చే మార్గంలో చెక్ డ్యాంను నిర్మించారు. అటవీ పార్కు మొత్తాన్ని, నగరాన్ని చూసేలా ఎత్తయిన వాచ్ టవర్ను ఏర్పాటు చేశారు.
అటవీ ప్రాంతంలో ఖాళీ ప్రదేశం ఉన్న చోట 45 వేల మొక్కలు నాటారు. ఇందులో సుమారు 44 రకాల అటవీ జాతి మొక్కలు ఉన్నాయి.

ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న పార్కు ప్రవేశ ద్వారాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పిల్లల కోసం ఓపెన్ ఎయిర్ స్కూలు వేదికను ఏర్పాటు చేశారు. పార్కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శని, ఆదివారాల్లో వెయ్యి మందికి పైగా సందర్శిస్తున్నారు. ఇతర రోజుల్లో 3 నుంచి 4 వందల దాకా సందర్శకులు వస్తున్నారు. ఈ పార్కులో ఉన్న రకరకాల పక్షులను గుర్తించేందుకు వారం వారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications













