హైదరాబాద్ మహా నగరానికి అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పిలుస్తారు. ఇటీవల కురుస్తోన్న వర్షాలకు ఇక్కడ జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పచ్చదనం కమ్మేసినట్లు కనిపించే ఇక్కడి పచ్చని చెట్ల సమూహం అనంతగిరి అటవీ ప్రాంతాన్ని ప్రకృతి ప్రేమికుల విడిదికేంద్రంగా మార్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో అనంతగిరి అడవిని దగ్గరగా ముద్దాడుతున్నట్లు సాగిపోయే నల్లని మేఘాలు ఇక్కడ అదనపు ఆకర్షణగా నిలుస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు. పని ఒత్తిడితో సతమతమయ్యే భాగ్యనగరవాసులు ఈ సీజన్లో సేదదీరేందుకు అనువైన ప్రదేశం ఈ తెలంగాణ ఊటీ.. అనంతగిరి కొండలు.
దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణం విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు ఆరు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలు మంచి పర్యాటక ప్రదేశంగా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి పచ్చని ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. అందుకేకాబోలు అనంతగిరిని 'తెలంగాణ ఊటీ'గా పిలుస్తారు. ఈ కొండల పైనుంచి వచ్చే నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్కు చేరుతాయి.
అలాగే, మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైన అడవులుగా అనంతగిరి అడవులు పేరుపొందాయి. వికారాబాద్ నుంచి అనంతగిరికి వెళ్లే రోడ్డు మార్గంలో దారిపొడవునా గుబురుగా పెరిగిన పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు తారసపడతాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చటి హరితవనాలు, ఇరుకైన లోయలు ఇలా చెప్పుకుంటూపోతే ఇక్కడి ప్రకృతి అందాలను మాటల్లో చెప్పలేం.

ఆథ్యాత్మికతతో నిండిన ప్రకృతి అందాలు..
అనంతర గిరి కొండల నడుమ ఆథ్యాత్మిక నేపథ్యం కూడా ఉందని చాలామందికి తెలియదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అనంత పద్మ నాభస్వామి ఆలయం ఉంది. దీంతోపాటు దిగువన లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి చూపరులను కనువిందు చేస్తుంది. అంతేకాదు, ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెప్పబడుతోంది. ఈ నది చిన్నపాయగా ప్రారంభమై మూసీగా హైదరాబాద్ నగరంలో ప్రవహించిన తర్వాత నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో విలీనం అవుతుంది.
ఈ ప్రకృతి అందాలు వెండితెరపై కూడా సందడి చేస్తుంటాయి. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్లకు క్యూ కడుతూ ఉంటారు. అనంతగిరి కొండలతోపాటు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించేవారిలో పర్యాటకులతోపాటు టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకులూ కూడా ఉంటారంటే అతిసయోక్తికాదు.

అందుబాటులో బస్సులు..
ఇక్కడికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం నిత్యం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్లోని సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ప్రతి అరగంటకూ ఒక బస్సు దొరుకుతుంది. అలాగే, ముంబయి వెళ్లే ప్రతి రైలు వికారాబాద్లో ఆగుతుంది. మరీ ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లేవారు ఇక్కడి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది.

ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలిన అవసరం ఉందని పర్యాటకులు కోరుతున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా కుటుంబసమేతంగా అనంతగిరి కొండలను చూసేందుకు ఇప్పుడే బయలుదేరండి మరి!



Click it and Unblock the Notifications













