దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ఎప్పుడైనా చూశారా?
హైదరాబాద్ అంటే ఇప్పటివరకు చార్మినార్, సైబర్ టవర్స్ గురించే ఎక్కువగా చెప్పుకుంటుంటారు. పర్యాటకులు కూడా ఈ రెండు ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి కనబరిచేవారు. అయితే ఇప్పుడు వీటిసరసన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చేరింది. హైదరాబాద్ నగరంలో ఉన్న దుర్గం చెరువు ప్రశాంతమైన మరియు సుందరమైన సరస్సు. ఈ ప్రాంతం స్నేహితులు కుటుంబసభ్యులతో సమయం గడిపేందుకు ఎంతో ఉత్తమమైన ప్రదేశం. దీనిని చూసేందుకు ప్రతి రోజు వేలసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
సందడిగా ఉండే సైబర్సిటి మధ్యలో ప్రశాంతమైన ప్రదేశం ఇది. వీకెండ్లో అయితే ఈ ప్రాంతంలో ఉండే రద్దీ గురించి అసలు చెప్పక్కర్లేదు. గోల్కొండ కోట వాసులకు ఈ సరస్సు ప్రధాన నీటి వనరు. అందుకే దీనికి గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక ఈ మధ్య ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జ్గా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రఖ్యాతిగాంచింది. రండి ఈ దుర్గం చెరువు విశేషతలెంటో తెలుసుకుందాం..

దుర్గం చెరువు చరిత్ర...
1687లో ఔరంగాజేబు సేనలను ముప్పుతిప్పలు పెట్టి గోల్కొండకు నీరందించిన ఈ చెరువు భారతదేశంలోని రహస్యతటాకాల్లో ఒకటిగా చరిత్ర నమోదు చేసుకుంది. అయితే కాలగమనంలో ఆంధ్రపాలకుల నిర్లక్ష్యంతో చెరువు అందాలు అంతరించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చెరువు పునరుద్దరణకు పాటుపడింది. ప్రత్యేక శ్రద్ధతో దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. చారిత్రక హైదరాబాద్ నగరానికి మరింత అందం చేకూర్చేలా దుర్గం చెరువుపై అత్యాధునిక పరిజ్ఞానంతో కేబుల్ బ్రిడ్జిని రాష్ట్రప్రభుత్వం నిర్మించింది.
రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ తీగల వంతెనను సెప్టెంబర్ 25న ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెనతో జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్ రద్దీ తగ్గింది. దీంతోపాటు దుర్గం చెరువులో బోటింగ్ను, కేబుల్ బ్రిడ్జికి అనుసంధానంగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 నుంచి నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్ను ప్రజలకు అంకితం చేశారు. దీనికి పెద్దమ్మతల్లి ఎక్స్ప్రెస్ వే అని పేరు కూడా పెట్టారు.

ఈ ప్రాంత విశేషాలు..
నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో ఇది ప్రసిద్ధిగాంచిది. ఇదిహైదరాబాద్ నగరంలో మాదాపూర్ , జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. ఈ నగరం సైబరాబాద్గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండేది. తర్వాత పలు రూపాంతరాలు చెందింది. తొలుత దుర్గం చెరువు కొద్దిమంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు,సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్లే దీనికి సీక్రెట్ లేక్ అనే పేరు కూడా ఉంది. ఇప్పటికీ తన సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఈ ప్రాంతంలో ఒక కృత్రిమ జలపాతం, ఫాంటెన్ కూడా ఉన్నాయి.

ఇవి ఈ ప్రాంతాన్ని మరింతగా అందంగా మారుస్తున్నాయి. దుర్గం చెరువు పర్యటన ప్రధాన విశేషాలలో ఒకటి దాని పడవ ప్రయాణం. ఇది పచ్చని చెట్లమధ్య ఉల్లాసంగా అద్భుతమైన వీక్షణను అందజేస్తుంది. మెకనైజ్డ్ బోట్లు, వాటర్ స్కూటర్, పెడల్ బోట్లు వంటి విభిన్నమైన పడవులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతం అరవై మూడు విభాగాల భూభాగంలో విస్తరించి ఉన్న ఒక ప్రత్యేక ప్రాంతం మరియు దక్కన్ పీఠభూమి యొక్క పచ్చని పొలాలు, సుందరమైన వాలులతో ఆవరించి ఉన్న అందమైన ప్రదేశం ఇది.



Click it and Unblock the Notifications













