జూలై 7న తెలంగాణ ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో గోల్కొండ కోట ముస్తాబవుతోంది. చారిత్రకనిలయమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజులు జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోల్కొండ కోటలో వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు బారికేడ్ల నిర్మాణంతో పాటు స్టేజీల నిర్మాణం పూర్తి చేశారు. నగరాలు ఎంతగా మారినా భక్తి శ్రద్ధలతో నగరవాసులు జరుపుకుంటున్న ఏకైక పండుగ బోనాల పండుగ అనడంలో సందేహమే లేదు.
భాగ్యనగరంలోని గొల్కొండ కోటలో వెలిసిన జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో సంబరం మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్ అంతటా బోనాలు జరుపుతారు. అటు పిమ్మట లాల్ దర్వజా, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవపు ఉత్సాహం కనిపిస్తుంది. నగరాల తర్వాత జిల్లాలలోనూ బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ మాసం తెలంగాణలో వేరు..
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇళ్లల్లో ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ప్రతి ఇంటా.. కుటుంబసభ్యులందరూ ఆలయాలకు వెళతారు. కొత్త బియ్యంతో వండిన భోజనాన్ని అందంగా ఆలకరించిన మట్టి కుండలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. పట్టు వస్త్రాలు, పసుపుకుంకుమలను ఇచ్చి మొక్కులు మొక్కుతారు. ఆషాఢంలో అత్తా అల్లుళ్లు ఒకే గడప దాటకూడదనేది ఆచారంగా నడుస్తుంది. అయితే, తెలంగాణకు సంబంధించినంత వరకు కొత్త అల్లుళ్లకు ఇదే పండగను తెచ్చే మాసం. ఆ తల్లికి బోనాలను ఇవ్వడానికి కొత్త అల్లుళ్లు ప్రత్యేకంగా అత్తవారింటికి ఆహ్వానిస్తారు.
తొట్టెల తీసుకువెళతారు. భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న హైదరాబాద్ పాతబస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం ఇక్కడ మరో విశేషం. హైదరాబాద్ వాడల్లో వీధుల్లో వెలసిన అమ్మవారి గుళ్లన్నీ అలంకరణలతో కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. వీధుల్లో ఎటుచూసినా విద్యుద్దీపాల వెలుగుల్లో నగరం ధగధగమని మెరుస్తూ చూపరులను కనువిందు చేస్తాయి.

బోనాలకు ప్రత్యేక బస్సులు..
ఇప్పటికే, గోల్కొండ జగదాంబిక బోనాలకు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు వెల్లడించారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే, సీబీఎస్, పటాన్చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్షుక్నగర్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్పల్లి నుంచి 75 బస్సులు తిరుగుతున్నాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్ - 90004 06069, మెహిదీపట్నం - 99592 26133, గోల్కొమ్ డా - 99592 26031 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ బస్సుల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications













