రెండు రాష్ట్రాల్లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ను చూశారా?
భారతదేశంలో చాలా మంది రైలు ప్రయాణాలను ఇష్టపడతారు. ఎందుకంటే, పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య పరుగులు తీసే రైల్లో, కిటికీ పక్కన కూర్చుని, నచ్చిన పాటలు వింటూ, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అందరూ కోరుకుంటారు. కానీ, భారతీయ రైల్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఒక రైల్వేస్టేషన్ గురించి.. అవునండి మీరెప్పుడైనా ఈ రైల్వేస్టేషన్ గురించి విన్నారా? అయితే మరెందుకాలస్యం రెండురాష్ట్రాల మధ్య ఉన్న ఈ రైల్వేస్టేషన్ను అసలు ఎందుకు నిర్మించారో తెలుసుకుందా పదండి.
రెండు రాష్ట్రాల్లో ఒకటే స్టేషన్..
ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ పేరు నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ సగం గుజరాత్, మరొక భాగం మహారాష్ట్రలో ఉంటుంది. ఈ స్టేషన్ పశ్చిమ రైల్వేజోన్ పరిధిలోకి వస్తుంది. ఇది ఒకవైపు మహారాష్ర్టలోని నందుర్బార్ జిల్లాలో ఉంటే, మరోవైపు గుజరాత్లోని తాపి జిల్లాలో ఉంటుంది. ఈ స్టేషన్లోని అన్ని విషయాలు రెండు రాష్ట్రాల మధ్య విభజించారు. స్టేషన్ మధ్యలో ఒక లైన్ గీసి ఉంటుంది. ఈ గీత ఒకవైపు మహారాష్ట్ర, మరోవైపు గుజరాత్ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది.

ఈ నవాపూర్ రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ కూడా ఉంది, ఇందులో సగం గుజరాత్లో మరియు సగం మహారాష్ట్రలో ఉంది. బెంచీకి ఇరువైపులా పెయింట్తో మహారాష్ట్ర, గుజరాత్ అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఈ స్టేషన్కు వచ్చే చాలా మంది ప్రజలు ఈ బెంచ్పై కూర్చుని ఫోటోలు కూడా తీసుకుంటారు. దాంతో ఈ స్టేషన్లో ఒక సెల్ఫీ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వేస్టేషన్కు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి మరీ ఫోటోలు దిగుతుంటారు.
ఈ స్టేషన్ చరిత్ర..
నవాపూర్ రైల్వే స్టేషన్ను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం వెనుక కూడా ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. నిజానికి ఈ స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ విభజనకు ముందు నిర్మించారు. కానీ మే 1, 1961న ముంబై ప్రావిన్స్ మహారాష్ట్ర, గుజరాత్ అనే రెండు రాష్ట్రాలుగా విభజించారు. ఈ విభజన కింద నవాపూర్ రైల్వే స్టేషన్ కూడా రెండు రాష్ట్రాల మధ్య సగానికి విభజించారు. అప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ ఇలా రెండు రాష్ట్రాల మధ్యలో ఉంది. దాంతో ఈ రైల్వేస్టేషన్కు ఈ గుర్తింపు లభించింది.

నాలుగు భాషల్లో..
ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫారమ్లు నిర్మించారు. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ మొత్తం పొడవు 800 మీటర్లు. వీటిలో దాదాపు 500 మీటర్ల గుజరాత్, మిగిలిన 300 మీటర్లు మహారాష్ట్ర కిందకు వస్తాయి. ఈ రైల్వే స్టేషన్లో నాలుగు రైల్వే ట్రాక్లు మరియు మూడు ప్లాట్ఫారమ్లు ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవాపూర్ రైల్వే స్టేషన్ టిక్కెట్ విండో మహారాష్ట్ర సరిహద్దులో ఉంటే, స్టేషన్ మాస్టర్ గుజరాత్ సరిహద్దులో కూర్చుంటాడు.
ఈ నవాపూర్ రైల్వేస్టేషన్లో వినిపించే ప్రకటనలు కేవలం ఒకటి రెండు భాషల్లో కాదు నాలుగు భాషల్లో వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికుల కోసం హిందీ, ఇంగ్లీష్, మరాఠీ మరియు గుజరాతీ భాషలలో ప్రకటనలు చేస్తారు. అంతే కాదు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమాచార బోర్డులపై కూడా ఈ నాలుగు భాషల్లో రాసి ఉంది. దాంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. మరెందుకు ఆలస్యం ఈ రైల్వేస్టేషన్ను ఒకసారి చూసొద్దామా.



Click it and Unblock the Notifications













