మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో చాలామంది ఎంతో భక్తితో భోలేనాథున్ని కొలుస్తారు. అంతేకాదు. చాలామంది ఈ మాసంలో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. అలాంటివారికోసం ఐఆర్సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సిటిసి భక్తులకు ఈ అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐఆర్సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లతో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. మరి ఈ ప్రయాణ వివరాలు ఇలా ఉన్నాయి.
టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్ భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి హోటల్కు వెళ్తారు. అక్కడ ప్రెష్ అయ్యాక అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు.

అక్కడి నుండి కుదాల్నగర్కు జర్నీ ప్రారంభమవుతుంది. మూడో రోజు ఉదయం కుదాల్నగర్ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యాక ఫ్రెష్ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాల దర్శనం చేసుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్కు వెళ్లారు. ఆ నైటందిఅక్కడే బస చేస్తారు. నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం చేసి రామేశ్వరం నుంచి బస్సు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈ బస్సు జర్నీలో మధురై వెళ్తారు.
అక్కడ మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అనంతరం సమయం ఉంటే షాపింగ్ చేస్తారు. ఆ తర్వాత కుదాల్నగర్ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి రైలు ప్రయాణం మొదలవుతుంది. ఇక, ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్కు చేరుకుని, హోటల్లో ఫ్రెషప్ అవుతారు. ఆ తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ వంటి ప్రదేశాలు సందర్శిస్తారు. తిరిగి హోటల్కు చేరుకుంటారు. డిన్నర్ చేసి, ఆ నైటంగా అక్కడే ఉంటారు.
ఈ స్టేషన్ల మీదుగా..
మరుసటి రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి కన్యాకుమారి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కొచ్చువేలికి బయలుదేరుతారు. కొచ్చువేలి చేరాక, త్రివేండ్రం ప్రయాణం ఉంటుంది. అక్కడ పద్మనాభ స్వామి ఆలయం దర్శనం ఉంటుంది. అనంతరం కోవలం బీచ్ సందర్శన ఉంటుంది. కొచ్చువేలి స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు. ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుంటుంది. హోటల్లో ఫ్రెషప్ అయ్యాక శ్రీరంగం టెంపుల్ దర్శనం ఉంటుంది.
మధ్యాహ్నం భోజనం చేసి తంజావూర్ ప్రయాణం ఉంటుంది. అక్కడ బృహదీశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి తంజావూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు ప్రయాణం ఉంటుంది. ఎనిమిదవ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత తొమ్మిదోరోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.
ప్యాకేజీ ధరలివే..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వీటి ధరలు ఇలా ఉన్నాయి. ఎకానమీ(SL): పెద్దలకు రూ.14,250గా నిర్ణయించారు. అదే 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకయితే రూ.13,250 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్(3AC): పెద్దలకు రూ.21,900 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700 చెల్లించాలి. కంఫర్ట్(2AC): పెద్దలకు రూ.28,450 ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ నవంబర్ 6వ తేదిన ప్రారంభం కానుంది.



Click it and Unblock the Notifications













